ఈసారి ఆ ఫైర్ బ్రాండ్ గెలుపు క‌ష్ట‌మేనా?

అనిల్‌ కుమార్‌ యాదవ్. మాజీ నీటిపారుదలశాఖా మంత్రి. మాట తూటాలు పేల్చే మంత్రిగా ఆయ‌న పేరు గడించారు. ఎంతోకాలం రాజకీయాల్లో ఉంటే కానీ సాధ్యంకాని విషయాలన్నీ అనిల్‌ చాలా త‌క్కువ కాలంలోనే సాధించేశారు. అలాగే అంతే వేగంగా కింద ప‌డిపోయార‌నే టాక్ వినిపిస్తోంది. 2014లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ సమయంలో ఏపని అడిగినా.. మనం అధికారంలో లేం… అధికారంలోకి వస్తే చిటికెలో చేసేస్తాననేవారు.

2019లో మళ్లీ ఎమ్మెల్యే అయ్యారు. జగన్ కేబినెట్ లో కీలకమైన నీటిపారుదల శాఖామంత్రి అయ్యారు. ఇక జిల్లాలో నీటి ప్రాజెక్డ్ లన్నీ పరుగులు పెడతాయనుకున్నారు‌. అనిల్‌ కూడా ఇంటా బయటా ప్రతిపక్షాలపై విరుచుకుప‌డేవారు. అయితే.. కళ్లు మూసి కళ్లు తెరిచేలోపే… అనిల్ మూడేళ్ల మంత్రి పదవీ కాలం పూర్తయింది. నెల్లూరు, సంగం బ్యారేజీల్లో మిగిలిన పది శాతం పనులను కూడా ఆయన తన హయాంలో చేయించలేకపోయారు. వరసగా రెండేళ్లు వచ్చిన‌ వరదలకి సోమశిల‌ డ్యాం దెబ్బతింది.

కేంద్ర బృందాలు పలుమార్లు పరిశీలించి, వెంటనే మరమ్మతులు చేయాలని సూచించినా… దిక్కులేకుండా పోయింది. నగరంలో కాలువకట్టల మీద ఇళ్లు నిర్మించుకున్నవారికి పట్టాలిస్తామని హామీ ఇచ్చి, తరువాత ఇరిగేషన్ స్థలాల్లో పట్టాలు ఇవ్వడం కుదరదని తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీ నుంచి పోటీ చేస్తే ఓటమి తప్పదని అర్ధమైపోయిందిట. దీంతో వెంకటగిరి నుంచి పోటీ చేయాలని భావించారట. ఇదే విషయాన్ని సీఎం జగన్ కి పదేపదే చెప్పారట.

దీనిపై అధినేత ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు, కానీ, ఈ విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చి వైర‌లైంది. వెంకటగిరి నుంచి అనిల్ పోటీ చేయబోతున్నారని తెలియగానే.. స్థానికేతరలు మాకొద్దంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్ లు వెల్లువెత్తాయి. దాంతో అనిల్ సైలెంట్ అయిపోయారు. మొన్నటిదాకా మా అనిల్ అన్న… మా అనిల్ అన్న… అంటూ ఓ రేంజ్ లో వీరాభిమానం చూపిన వారంతా అనిల్ కి దూరమవుతున్నారు. మొత్తానికి ఇప్పుడు అనిల్ అంద‌రికీ కాని వాడిగా.. ఆయ‌న దూకుడే ఆయ‌న‌కు శ‌తృవుగా మారిపోయిందని అంటున్నారు ప‌రిశీల‌కులు.