వైఎస్ భార‌తిపై టీడీపీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌

ఢిల్లీలో వెలుగు చూసింద‌ని బీజేపీ నేత‌లు చెబుతున్న లిక్క‌ర్ కుంభ‌కోణంపై అనేక వార్త‌లు.. వ్యాఖ్య‌లు వ‌స్తున్నాయి. ఇది రాజ‌కీ యంగా అనేక మ‌లుపులు తిరుగుతూనే ఉంది. ఈ స్కాంలో తెలుగు రాష్ట్రాల‌కు చెందిన అధికార పార్టీల నేత‌ల‌పైనా.. ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. బీజేపీ నేత‌లు తెలంగాణ ముఖ్య‌మంత్రి కుమార్తె క‌విత పాత్ర ఉంద‌ని ఢిల్లీలో ఆరోపించిన విష‌యం తెలిసిందే. దీనిపై ఆమె ప‌రువున‌ష్టం దావా వేశారు. అయితే.. ఇప్పుడు ఈ వివాదంలో తొలిసారి ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ జోక్యం చేసుకుంది. ఏపీ టీడీపీ నాయ‌కులు.. ఈ స్కాంలో సీఎం జ‌గ‌న్ స‌తీమ‌ణి.. భార‌తి హ‌స్తం ఉంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అది కూడా జ‌గ‌న్-భార‌తిల పెళ్లిరోజే ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం మ‌రింత సంచ‌ల‌నంగా మారింది.

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో వైఎస్ భారతి, ఎంపీ విజయసాయిరెడ్డి సూత్రధారులని టీడీపీ కీల‌క నాయ‌కుడు, పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు(ఈయ‌న ప్ర‌స్తుతం వైసీపీలో ఉన్న ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి త‌మ్ముడు). ఢిల్లీలో తీగలాగితే.. తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయని ధ్వజమెత్తారు. వైఎస్ భారతి నడుపుతున్న జగతి పబ్లికేషన్స్కు, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్కు ఆర్థిక సంబంధాలున్నాయని ఆరోపించారు. క్విడ్ ప్రోకో-1లో జగతి పబ్లికేషన్స్కి.. ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కోట్ల రూపాయలు మళ్లించిందన్నారు.

జగన్ కేసుల్లో ఏ5గా ఉన్న ట్రైడెంట్, అదే సంస్థ అధిపతి పెనాక శరత్చంద్రారెడ్డి ఏ8గా ఉన్నారని వెల్లడించారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో వీళ్లదే కీలకపాత్రని ఆరోపించారు. అదాన్ డిస్టిల్లరీస్ ద్వారా అక్రమంగా సంపాదించిన రూ. 5వేల కోట్ల సొమ్మును ఢిల్లీ స్కాంలో ఉపయోగించినట్లు చెప్పారు. ప్రస్తుత అదాన్ డైరెక్టర్ శ్రీనివాస్, విజయసాయి రెడి అల్లుడు రోహిత్ రెడ్డి నాలుగు కంపెనీల్లో భాగస్వాములుగా ఉన్నారన్నారు.

అరబిందో గ్రూపునకు సంబంధించిన చాలా కంపెనీల్లో శరత్ చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డి, వారి కుటుంబసభ్యుల ఉమ్మడి భాగస్వామ్యంతో నడుస్తున్నాయని పేర్కొన్నారు. క్విడ్ ప్రోకో కేసు ప్రారంభం నుంచి.. నేటి మద్యం కుంభకోణం వరకు జరిగిన పరిణామాలన్నీ విజయసాయిరెడ్డి కనుసన్నల్లోనే జరిగాయన్నారు. జగన్ ఢిల్లీకి వెళ్లింది కూడా ఈ మద్యం కుంభకోణంలో తన భార్యను కాపాడుకునేందుకేనని విమర్శించారు. అయితే.. ఇన్ని లెక్క‌లు ప‌క్కాగా చెబుతుండ‌డంతో ఆనం వ్యాఖ్య‌ల‌ను తోసిపారేయ‌లేమ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీంతో ఇది మ‌రింత వివాదంగా మారి.. ఇరు పార్టీల మ‌ధ్య భూకంపం సృష్టించినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.