ఆ దూకుడే ఉండ‌వ‌ల్లికి సెగ పెట్టిందా..?

ఎంత ఎమ్మెల్యే అయినా.. ఎంత అధికార పార్టీ నాయ‌కురాలైనా.. కొన్ని హ‌ద్దులు ఉంటాయి.. కొన్ని ప‌రిమితులు కూడా ఉంటాయి. ఎక్క‌డ త‌గ్గాలో.. ఎక్క‌డ నెగ్గాలో తెలిసి ఉండ‌డం .. అత్యంత అవ‌స‌రం. అయితే ఈ విష‌యంలో గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీదేవి.. అన్ని హ‌ద్దులు చెరిపేశార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ఏపీ అధికార పార్టీలో ఉండ‌వ‌ల్లి శ్రీదేవి విష‌యం హాట్ టాపిక్‌గా మారింది. ఇక్క‌డ ఆమెకు పోటీగా అధిష్టాన‌మే.. కొత్త‌గా స‌మ‌న్వ‌య క‌ర్త‌గా డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద‌రావును నియ‌మించింది.

ఇది తీవ్ర వివాదంగా మారింది. అయితే.. దీని పూర్వాప‌రాలు గ‌మ‌నిస్తే.. త‌ప్పంతా.. శ్రీదేవి వైపే ఉంద‌ని.. పార్టీలోగుస గుస వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో తాడికొండ నుంచి అనూహ్యంగా ఉండవల్లి శ్రీదేవి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె విజయం సంచలనమే అయినప్పటికీ.. ఆ తర్వాత ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. ఇసుక తవ్వకాలు, అక్రమ మైనింగ్, పేకాట శిబిరాల నిర్వహణలో ఆమె పేరు ప్రముఖంగా వినపడింది.

ఆమె అనుచరులే ఈ విషయాన్ని బయటపెట్టి.. రచ్చ చేశారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌తో విభేదాలు, అంబేడ్కర్ విగ్రహం వద్ద నిలబడి… ఇది అంబేడ్కర్‌ విగ్రహమే కదా అని అడగటం, మాదిగలు అంబేడ్కర్ కంటే.. జగ్జీవన్ రాం పేరు ఎక్కువగా తలచుకోవాలని ప్రకటించడం వంటివి.. వివాదాల్లోకి లాగాయి. స్థానిక ప్రజాప్రతినిధుల్ని కూడా పట్టించుకోకుండా… ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. నామినేటెడ్ పోస్టుల విషయంలో అవినీతి ఆరోపణలు వచ్చాయి.

ఇవన్నీ శ్రీదేవికి ప్రతికూలంగా మారి… డొక్కాకు మార్గం సుగమం చేశాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా.. సొంత పార్టీ నేత‌ల నుంచి గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో అప్పులు చేసిన ఆమె.. స‌గం చెల్లించి.. మిగిలిన సొమ్మునుఇవ్వ‌కుండా.. పోలీసుల‌తో వారిపైనే కేసులు పెట్టించ‌డం .. అధిష్టానం వ‌ర‌కు వెళ్లింది. వీటిని ఎక్క‌డో ఒక చోట సామ‌ర‌స్య పూర్వ‌కంగా.. ప‌రిష్క‌రించుకునే ప్ర‌య‌త్నం చేయాల్సిన .. శ్రీదేవి ఆదిశ‌గా అడుగులు వేయ‌లేద‌ని.. వైసీపీలో గుస‌గుస వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌రిణామాల‌తోనే అధిష్టానం ఆమెకు చెక్ పెట్టింద‌నే వాద‌న వినిపిస్తోంది.