మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి.. ఆ నలుగురిలో ఒకరు

హాట్ టాపిక్ గా మారిన మునుగోడు ఉప ఎన్నికలు.. ప్రధాన రాజకీయ పార్టీలకు పెను పరీక్షగా మారిన వైనం తెలిసిందే. ఈ ఉప ఎన్నికకు కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి వెళ్లిపోవటంతో.. ఆ పార్టీకి అభ్యర్థి సమస్య లేదన్న సంగతి తెలిసిందే. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి డిసైడ్ చేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వంపై ఆగ్రహం వ్యక్తమైన నేపథ్యంలో.. సరైన అభ్యర్థి కోసం కసరత్తు సాగుతోంది. ఇదిలా ఉంటే.. అసలీ ఉప ఎన్నికకు కారణమైన రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన హ్యాండ్ తో కాంగ్రెస్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.

ఈ ఎన్నికల్లో తమ ఉనికిని చాటుకోవాల్సిన పరిస్థితి అనివార్యం కావటంతో.. తగిన అభ్యర్థిని బరిలోకి దించటం కోసం భారీ ఎత్తున కసరత్తు సాగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పలువురి అభ్యర్థిత్వాలపై చర్చ సాగిన తర్వాత.. మొత్తం నలుగురు అభ్యర్థుల్ని ఫైనల్ లిస్టుగా తయారు చేశారు. వారిలో ఒకరిని అభ్యర్థిగా ప్రకటిస్తారని చెబుతున్నారు. ఇంతకూ ఆ నలుగురు ఎవరు? అన్నదిప్పుడు ఆసక్తకరంగా మారింది.

మనుగోడు ఉప ఎన్నిక మీద కాంగ్రెస్ అధిష్ఠానం సైతం కన్నేయటం.. రేవంత్ మీద గుర్రుగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఢిల్లీకి ప్రత్యేకంగా పిలిచిన గాంధీ కుటుంబం.. ఆయనతో ప్రియాంక ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మునుగోడు సెంట్రిక్ గా వారి చర్చ సాగినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థిని ఫైనల్ చేసే విషయంలో కోమటిరెడ్డి ఆలోచనలకు సైతం పెద్ద పీట వేస్తారన్న మాట వినిపిస్తోంది.

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా నలుగురు ఆశావాహులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు పాల్వాయి స్రవంతి.. క్రిష్ణారెడ్డి.. పల్లె రవి.. కైలాష్ నేత ఉన్నారు. అభ్యర్థుల బలాబలాలు.. వారికున్న గెలుపు అవకాశాలపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న సునీల్ కనుగోలు అధిష్ఠానానికి రిపోర్టు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. దీంతో.. ఈ నలుగురిలో ఒకరిని అధికారికంగా అభ్యర్థిగా డిసైడ్ చేసి ప్రకటిస్తారని చెబుతున్నారు.