బుల్లితెర ‘పెద్ది’ బెటర్ అనిపిస్తున్నాడు

నిన్న అర్ధరాత్రి నుంచి పెద్ది నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. థియేటర్ రిలీజ్ నుంచి కేవలం ముప్పై అయిదు రోజుల గ్యాప్ తో రావడం ఇంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీకి సబబు కాకపోయినా, రెండు వారాల తర్వాత ఎలాగూ నెమ్మదించి పోయింది కాబట్టి ఇలా చేయడం వెనుక కారణాన్ని అర్థం చేసుకోవచ్చు. మా ఇంటి బంగారం వచ్చాక మరీ స్లో అయిపోయిన పెద్ది మీద ఓటిటి పరంగా భారీ అంచనాలున్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ స్థాయిలో వ్యూస్ ఎక్స్ పెక్ట్ చేస్తోంది సదరు సంస్థ.

లక్కీగా కొత్త వెర్షన్ ఓటిటి ఆడియన్స్ కోసం అందుబాటులోకి తేవడం చూసి ఫ్యాన్స్ హమ్మయ్య అనుకుంటున్నారు. ఎందుకంటే బుల్లితెర పెద్దిలో కీలక మార్పులు జరిగాయి. చరణ్ పెళ్లి చూపుల సీన్, మార్కెట్ లో జాన్వీ కపూర్ ప్రచారంలోని అభ్యంతరంగా అనిపించిన సీన్లు తీసేయడం, దాని ముందు వెనుక కొత్త సన్నివేశాలు, సెకండాఫ్ కుస్తీ అయిపోయాక సైకిల్ వేసుకుని అచ్చియమ్మ ఇంటికి వెళ్లే ఎపిసోడ్, పూర్తిగా ట్రిమ్ చేసిన శివరాజ్ కుమార్ ఫ్లాష్ బ్యాక్ తో పాటు అక్కడక్కడా కొన్ని అడ్జస్ట్ మెంట్లు బాగా కుదిరాయి.

ఒకరకంగా చెప్పాలంటే ఇదేదో ముందే జాగ్రత్త పడి రిలీజైన మొదటి రోజు నుంచే ఈ వెర్షన్ థియేటర్లలో ఆడించి ఉంటే కొంత మిక్స్డ్ టాక్ తగ్గేనే కామెంట్స్ లో నిజం ఉంది. ఎమోషన్ పేరుతో అవసరం లేనివి ఉంచేసి, అవసరం లేనివి పెట్టేయడం వల్ల బాలీవుడ్ జనాలు కనెక్ట్ కాలేదు. దానికి తోడు జాన్వీ కపూర్ పాత్ర గురించి జరిగిన డిస్కషన్ లేనిపోని డ్యామేజ్ చేసింది. అసలు పెద్దిని ఇప్పటిదాకా చూడని వాళ్లకు మంచి ఎక్స్ పీరియన్స్ అయితే దక్కనుంది.

ఇక నుంచి అయినా ఇతర దర్శకులు ఎడిటింగ్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండటం అవసరం. తమ కంటెంట్ ని తాము ఎంతగా ప్రేమించినా సాధారణ ప్రేక్షకుల కోణంలో ఆలోచిస్తేనే సరైన కత్తెర్లు పడతాయి. లేదంటే ప్రీమియర్ షోల నుంచే ఎఫెక్ట్ పడుతుంది. తెలుగు రాష్ట్రాల వరకు సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన పెద్ది బయట రాష్ట్రాలు, దేశాల్లో ఆశించినంత ఫలితం అందుకోలేకపోయింది. చూడాలి మరి టీవీలో పెద్దిని చూశాక రియాక్షన్లు ఎలా మారబోతున్నాయో.