ఏదో చిన్న ఉద్యోగమో.. పనో చేసుకుని కుటుంబాన్ని నెట్టుకొచ్చే మనకే వంట గదిలోకి వెళ్లేందుకు సమయం ఉండదు. సమయం ఉన్నా.. వెళ్లాలని కూడా ఉండదు. మరి నిత్యం ఎంతో బిజీగా ఉంటూ.. ఇటు రాష్ట్ర పరిపాలన, అటు పార్టీ పరంగా ఎదురయ్యే సవాళ్లు.. వంటి కార్యక్రమాలతో క్షణం కూడా తీరిక ఉండని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. తన మనవడి కోసం.. ఏకంగా పూరీలు వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ముఖ్యమంత్రిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. రేవంత్రెడ్డి తన కుటుంబానికి సమయం ఇస్తున్నారు. తరచుగా కుటుంబంతో కలిసి.. ఆలయాలకు, వేడుకలకు హాజరవుతుంటారు. ఇక, ఆయా సమయాల్లో మనవడిని తన దగ్గరే ఉంచుకోవడం.. మురిపెంచేయడం తెలిసిందే. అయితే.. తాజాగా తన ఎక్స్లో పోస్టు చేసిన ఓ వీడియో ఆసక్తిగా మారింది. మనవడితో ముచ్చటిస్తూ.. పూరీలు ఒత్తి.. వాటిని ఏ షేప్లో కావాలో చర్చించుకుని.. అలానే వాటిని అద్ది నూనె కళాయిలో వేయించడం.. మనవడితో కలిసి పూరీలు తినడం వంటివి ఆసక్తిగా మారింది.
పూరీలు ఒత్తుతున్న సమయంలో గుండ్రంగా కావాలా.. అని అడగడం.. దీనికి మనవడు రియాక్ట్కావడం.. తనకు గుండ్రంగా వద్దని చెప్పడం.. ఎంతో ఓపిగ్గా.. సీఎం రేవంత్ పూరీలు చేయడం వంటివి ఆకట్టు కుంటున్నాయి. ఈ వీడియోను సీఎం తన సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. అయితే.. ఇది ఎప్పుడు తీశారు.. ఆయన పూరీలు ఎప్పుడుచేశారు? అనేది సస్పెన్స్. నెటిజన్లు ఈ వీడియోపై ఆసక్తికర కామెంట్లు కుమ్మరిస్తున్నారు.
రాష్ట్రానికి సీఎం అయినా.. మనవడికి తాతే అంటూ.. కొందరు వ్యాఖ్యలు చేయగా.. మరికొందరు సీఎంగా ఉన్నప్పటికీ.. కుటుంబానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని మెచ్చుకున్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కంటే.. హార్ట్ ఆఫ్ లివింగ్ గొప్పదని సీఎం నిరూపిస్తున్నారు అని ఒకరు కామెంట్ చేశారు. మొత్తానికి ఈ వీడియో అత్యంత ఎక్కువగా వీక్షించిన జాబితాలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates