వైసీపీలో నెంబర్ 2 స్థానాన్ని జగన్ ఎలిమినేట్ చేశారా?

వైసీపీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేయడానికి సీఎం వైఎస్ జగన్ కీలక నియామకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. జిల్లాల వారీగా పార్టీ బాధ్యతలను ముగ్గురు ముఖ్య నేతలకు అప్పగించిన విషయం విదితమే. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల బాధ్యతలను రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డికి అప్పగించగా….ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల బాధ్యతలను టీటీడీ ఛైర్మన్ వైవీసుబ్బారెడ్డికి….కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పార్టీ వ్యవహారాలను సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించారు.

దీంతోపాటు, తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయ సమన్వయ బాధ్యతలను కూడా సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించారు. అయితే, పార్టీలో నెంబర్ 2 అన్న ప్రశ్నే ఉత్పన్నం కాకుండా ఉండేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

జగన్ తర్వాత పార్టీనే నెంబర్ అన్న సంకేతాలను ఈ నియామకాల ద్వారా జగన్ ఇచ్చారన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ముగ్గురు నేతలకు సమానంగా బాధ్యతలను పంచడం ద్వారా….పార్టీలో నెంబర్ 2 స్థానాన్ని జగన్ ఎలిమినేట్ చేసినట్లయింది. తన తర్వాత పార్టీలో నెంబర్ 2 స్థానమే లేదని జగన్ మిగతా నెేతలకు చెప్పకనే చెప్పినట్లయింది.

ఈ ముగ్గురు నేతలకు మూడు సెపరేట్ పోస్టులున్నాయి. కీలమైన విశాఖ జిల్లాతోపాటు ఉత్తరాంధ్రను విజయసాయికి అప్పగించారు జగన్. ఇప్పటివరకు జగన్ తర్వాత నెంబర్ 2గా చలామణీ అయిన విజయసాయికి మూడు ఉత్తరాంధ్ర జిల్లాలు, పార్టీ అనుబంధ విభాగాల బాధ్యతలు అప్పగించారు జగన్. ఏపీ ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జలకు 5 జిల్లాల బాధ్యతలతోపాటు, పార్టీ కేంద్ర కార్యాలయ సమన్వయ బాధ్యతలు అప్పగించారు.

వైవీకి టీటీడీ చైర్మన్ పదవితోపాటు 5 జిల్లాల బాధ్యతలు అప్పగించారు. ముగ్గురికీ సమాన బాధ్యతలు అప్పగించడం ద్వారా నెంబర్ 2 అనేదే లేకుండా చేశారు జగన్. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జగన్ నేరుగా జనంతో మమేకం కావాలని యోచిస్తున్నారని చెప్పవచ్చు. సంక్షేమ పథకాల ద్వారా…జనంలోకి నేరుగా వెళ్లడం ద్వారా మోడీ, కేసీఆర్ తరహాలో తన ఇమేజ్ మరింత పెరుగుతుందని జగన్ భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్, మోడీ తరహాలో జనాన్ని ఆకర్షించి…పార్టీని సైడ్ లైన్ చేసి నేరుగా జనంతో సంబంధాలు పెట్టుకోవాలన్న కొత్త ట్రెండ్ ను జగన్ ఫాలో అవుతున్నారని అంటున్నారు.