ఢిల్లీ లీక్క‌ర్ స్కామ్.. తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌కంప‌న‌లు

ఢిల్లీ ఉప ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియా నివాసాలు స‌హా 31 ప్రాంతాల్లో సీబీఐ దాడులు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. గ‌త న‌వంబ‌రులో ప్ర‌వేశ పెట్టిన నూత‌న మ‌ద్యం పాల‌సీలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని.. భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయ‌ని .. నిబంధ‌న‌లు పాటించ‌లేద‌ని.. ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ సూచ‌న‌ల మేర‌కు ఈ కేసును సీబీఐ ద‌ర్యాప్తు చేస్తోంది. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు.. సోదాలు చేసింది. అంతేకాదు.. ఉప‌ముఖ్య‌మంత్రిపై ఎఫ్ ఐఆర్ కూడా న‌మోదు చేసింది.

అయితే.. ఇప్పుడు ఈ సీబీఐ సోదాలు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని కీల‌క మ‌ద్యం వ్యాపారుల‌కు ఈ లిక్క‌ర్ స్కాంలో సంబంధాలు ఉన్నాయ‌నే వార్త‌లు గుప్పుమంటున్నాయి. వీరిలో ఏపీకి చెందిన అధికార పార్టీ ఎంపీ కూడా ఒక‌రు ఉన్నార‌ని.. ఆయ‌న‌పై సాక్షాత్తూ కేంద్ర మంత్రి ఒకరు కొన్ని రోజుల కిందట పేరు పెట్టి మ‌రీ ఆరోప‌ణ‌లు చేశారని.. వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో డిల్లీలో జ‌రుగుతున్న సీబీఐ దాడులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నాయి.

ఎక్సైజ్‌ పాలసీ వ్యవహారంలో హైదరాబాద్‌లోనూ సీబీఐ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌ కోకాపేటలోని వ్యాపారి అరుణ్‌ రామచంద్రపిళ్లై నివాసంలో సీబీఐ బృందం సుమారు 4 గంటల పాటు తనిఖీలు చేసింది. హైదరాబాద్‌కు చెందిన అరుణ్‌ రామచంద్రపిళ్లై బెంగళూరులో నివసిస్తున్నారు. ఈకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇండో స్పిరిట్‌ గ్రూప్‌ ఎండీతో పిళ్లైకి సంబంధాలు ఉన్నట్టు సీబీఐ అభియోగం.

ఈ స్కాంలో రెండో నిందితుడిగా ఉన్న తెలుగు ఐఏఎస్‌ అధికారి గోపీకృష్ణ ఇంట్లోనూ సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. గోపీకృష్ణ ఢిల్లీ ఎక్సైజ్‌ కమిషనర్‌గా ఉన్న సమయంలోనే మద్యం దుకాణాల కేటాయింపులు జరిగాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా 31చోట్ల సీబీఐ దాడులు చేసింది. మ‌రోవైపు.. ఏపీకి చెందిన ఎంపీ నివాసాల్లోనూ దాడులు జ‌రిగే ఛాన్స్ ఉంద‌ని పెద్ద ఎత్తున గుస‌గుస వినిపిస్తోంది.