ఎంఎల్ఏకి జగన్ చెక్ పెట్టినట్లేనా?

క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే శాసనమండలిలో ఇద్దరిని జగన్మోహన్ రెడ్డి విప్ లుగా పదోన్నతి కల్పించారు. వీరిలో బీసీ నేత జంగా కృష్ణమూర్తి, ఎస్సీనేత, మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఉన్నారు. మామూలుగా అయితే ఈ విషయం పెద్దగా పట్టించుకోవక్కర్లేదు. కానీ డొక్కాను నియమించటంతోనే అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి.

డొక్కా నియామకం విషయంలో  అనుమానాలు ఎందుకంటే ఈయనది కూడా తాడేపల్లి నియోజకవర్గం కావటమే. ఇపుడు ఇక్కడినుండి ఎంఎల్ఏగా తాడేపల్లి శ్రీదేవి ఉన్నారు. ఎంఎల్ఏ మీద చాలా ఆరోపణలున్నాయి. చాలా వివాదాల్లో ఎంఎల్ఏ పేరు వినబడుతోంది. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కు ఎంఎల్ఏకి ఏ విషయంలో కూడా పడటంలేదు. అలాగే పార్టీలోని నేతలు, క్యాడర్ తో కూడా ఎంఎల్ఏకి పడటంలేదు. నిజానికి ఎంఎల్ఏ పార్టీకి పెద్ద తలనొప్పిగా తయారయ్యారు.

డాక్టర్ గా ఉండి టికెట్ తెచ్చుకున్న మొదటిసారే శ్రీదేవి గెలిచారు. ముందు లోప్రొఫైల్ మైన్ టైన్ చేస్తే బాగుండేది. కానీ అలావుండకుండా ఇసుక అక్రమ రవాణా, ఉద్యోగుల బదిలీలు ఇలా అన్నింటిలోనూ ఎంఎల్ఏ జోక్యం ఉందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. దాంతో ఎప్పుడూ ఎంఎల్ఏ చుట్టూ వివాదాలు ముసురుకుంటునే ఉన్నాయి. ఇవన్నీ సరిపోవన్నట్లు అసలు ఎంఎల్ఏ ఎస్సీనే కాదనే ఆరోపణలపై విచారణ కూడా జరిగింది. ఈ నేపధ్యంలోనే అనేక సందర్భాల్లో క్యాడరే ఎంఎల్ఏకి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు.

ఇవన్నీ జగన్ దృష్టిలో ఎప్పటికప్పుడు చేరుతునే ఉన్నాయి. అందుకనే ఇదే నియోజకవర్గానికి చెందిన డొక్కాను నియోజకవర్గానికి అదనపు సమన్వయకర్తగా జగన్ నియమించారు. ఎంఎల్ఏ ఉండగా అదనపు సమన్వయకర్తగా డొక్కాను నియమించారంటేనే జగన్ ఉద్దేశ్యం అర్ధమవుతోంది. రేపటి ఎన్నికల్లో శ్రీదేవికి టికెట్ ఇచ్చే ఉద్దేశ్యం జగన్ కు లేదని పార్టీలో ప్రచారం మొదలైపోయింది. డొక్కాకు సౌమ్యుడిగా, వివాదరహితుడిగా పేరుంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో డొక్కానే అభ్యర్ధి అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.