మరోసారి బెడిసికొట్టిన జగన్ వ్యూహం

ఏపీ ఉద్యోగుల విష‌యంలో ముఖ్య‌మంత్రి జగ‌న్ వ్యూహాలు బెడిసి కొడుతున్నాయి. కంట్రి బ్యూట‌రీ పింఛ‌న్ స్కీంను ఎత్తి వేయ‌లేమ‌ని.. ఆయ‌న ప‌దే ప‌దే చెబుతున్నారు. అయితే.. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు దీనిని ర‌ద్దు చేయాల్సిందేన‌ని.. ఉద్యోగులు ప‌ట్టుబ‌డుతున్నారు. మ‌రోసారి ఉద్య‌మాల‌కు రెడీ అవుతున్నారు. దీంతో ఎప్ప‌టిక‌ప్పుడు.. ఉద్యోగుల‌ను త‌నదారిలోకి తెచ్చుకునేందుకు సీఎం జ‌గ‌న్ వ్యూహాలు వేస్తున్నారు. అయితే.. ఎప్ప‌టిక‌ప్పుడు అవి బెడిసి కొడుతున్నాయి. తాజాగా మ‌రోసారి ఉద్యోగుల‌తో స‌ర్కారు పెద్ద‌లు చ‌ర్చించారు. అయితే.. ఈ చ‌ర్చ‌లు మ‌రోసారి విఫ‌ల‌మ‌య్యాయి.

అంతేకాదు.. మీరు ఎందుకు చేయ‌లేరు. మీక‌న్నా.. ఎక్కువ క‌ష్టాల్లో ఉన్న రాజ‌స్థాన్‌, జార్ఖండ్ వంటి రాష్ట్రాలు చేస్తున్నాయి క‌దా! అని ఉద్యోగ సంఘాల నేత‌లు.. స‌ర్కారును నిల‌దీశాయి. దీంతో జ‌గ‌న్ స‌ర్కారు మ‌రిన్ని స‌మ‌స్య‌ల్లో కూరుకుపోయిన‌ట్టు అయింది. సీపీఎస్ అంశంపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సచివాలయంలో మంత్రుల కమిటీ సమావేశం అయ్యింది. ఉపాధ్యాయుల సమస్యలపై ఆ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఓపీఎస్ తప్ప‌ వేరే విధానానికి ఒప్పుకునేది లేదని ఈ సమావేశంలో పాల్గొన్న ఉపాధ్యాయ సంఘాల నేతలు స్పష్టం చేశారు.

రాజస్థాన్ విధానాన్ని ఏపీలో అమలు చేస్తారనే ఆశతో సమావేశానికి వచ్చినట్లు తెలిపారు. సీఎం జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని.. ప్రభుత్వానికి ఏ ఉద్యోగ సంఘాలు వ్యతిరేకం కాదని తేల్చిచెప్పారు. రాజస్థాన్‌లో ఓపీఎస్ అమలు చేస్తుంటే.. ఏపీలో అమలుకు ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రతినిధులు, ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, ఏపీ సెక్రటేరియట్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.ఆర్ సూర్యనారాయణ, ఆర్టీసీ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు వై.వి.రావు, ఉపాధ్యాయ సంఘాల నేతలు, సీపీఎస్ ఉద్యోగ సంఘాల నేేతలు హాజరయ్యారు.

ఏపీలో 1.99 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో లక్ష మందికి ప్రొబేషన్‌ ఖరారు చేశారు. 2019 ఆగస్టు 1న మంత్రుల కమిటీ, అదే ఏడాది నవంబరు 27న అధికారుల కమిటీని ఏర్పాటు చేశారు. తర్వాత పలుమార్లు ఉద్యోగ సంఘాలతో చర్చించారు. చివరికి జీపీఎస్‌ను అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్‌లో 2,93,653 మంది సీపీఎస్‌ ఉద్యోగులు ఉన్నారు. వారికి ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి పాత పింఛన్‌ అమలుపై గెజిట్‌ విడుదల చేశారు. 2004 తర్వాత నియమితులైన వారికి ఛత్తీస్‌గఢ్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ని తీసుకొచ్చారు.

ఉద్యోగి బేసిక్‌లో 12% సీజీపీఎఫ్‌లో మదుపుచేయాలి. దీనిపై వడ్డీ, రుణాలు ఇస్తుంది. పదవీవిరమణ సమయంలో వెనక్కి ఇచ్చేస్తోంది. పింఛన్లు భారం కాకూడదనే.. గత ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన పింఛన్ల మొత్తంలో 4% భవిష్యత్తు అవసరాల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా పెడుతోంది. సీపీఎస్‌ ఉద్యోగులు, ప్రభుత్వం జమచేసిన మొత్తం నేషనల్‌ సెక్యూరిటీ డిపాజిట్‌ లిమిటెడ్‌(ఎన్ఎస్‌డీఎల్‌)లో రూ.18వేల కోట్లు ఉన్నాయి. ఈ నిధులు వచ్చాక ఉద్యోగుల భాగాన్ని వారి పీఎఫ్‌ ఖాతాల్లో జమచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మిగతా రూ.9 వేల కోట్లను పింఛన్ల కోసం ప్రత్యేకంగా ఉంచుతామంది. అయితే.. దీనిని ఉద్యోగులు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు.