ఏపీ స‌ర్కారు.. మరో అప్పు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంటే.. అప్పులు ప్ర‌దేశ్‌గా మారిపోయింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్న‌ప్ప‌టికీ.. ఇక్క‌డి వైసీపీ స‌ర్కారు మాత్రం ఈ వ్యాఖ్య ల‌ను ఏమాత్రం ఖాత‌రు చేయ‌డం లేదు. అయిన కాడికి.. అందిన కాడికి అప్పులు  చేస్తూనే ఉంది. తాజాగా మ‌రోసారి అప్పులు తెచ్చేసింది. ఈ సారి కూడా అంద‌రూ విస్మ‌యానికి గుర‌య్యేలా ఈ అప్పులు ఉండ‌డం గ‌మ‌నార్హం. అటు కేంద్రం నుంచి అప్పులు పెరిగిపోతున్నాయంటూ.. ఆందోళ‌న వ్య‌క్తం అయినా.. ఆర్బీఐ నుంచి కూడా హెచ్చ‌రిక‌లు వ‌చ్చినా.. ఏపీ ప్ర‌బుత్వం ఏమాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు.

పైగా అప్పులు ఎవ‌రు చేయ‌డం లేదో చెప్పాలంటూ.. ఎదురు దాడి చేస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా చేసిన అప్పుల విష‌యానికి వ‌స్తే.. మొత్తం 1000 కోట్ల రూపాయ‌ల‌ను ఏపీ ప్ర‌భుత్వం అప్పు చేసింది. అది కూడా ఆర్బీఐ నుంచి తీసుకోవ‌డం.. భారీ ఎత్తున వ‌డ్డీలు ప‌డినా అప్పులు ద‌క్కించుకోవ‌డం.. గ‌మ‌నార్హం. 16 ఏళ్లకు  7.74% వడ్డీతో  500 కోట్ల రూపాయ‌లు, 13 ఏళ్లకు 7.72 శాతం వడ్డీతో మరో రూ.500 కోట్ల రూపాయ‌ల‌ను అప్పుగా తెచ్చింది.

దీంతో గ‌డిచిన మూడు మాసాల్లో అంటే.. 105 రోజుల్లోనే రూ.31 వేల కోట్ల అప్పుతో ఏపీ ప్రభుత్వం రికార్డ్‌ సృష్టించింది. ఎఫ్ఆర్‌బీఎం కింద 2022-23 ఆర్థిక ఏడాదికి ఏపీకి రూ.48 వేల కోట్ల రుణానికి అనుమతి ఉండగా.. నేటికే రూ.31 వేల కోట్లు అప్పు తీసుకొచ్చింది. ఇప్పుడే ఎందుకు ఇలా? అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌స్తోంది. ఇలా.. ఒకే సారి.. వెయ్యి కోట్ల రూపాయ‌ల‌ను అప్పు చేయ‌డం వెనుక రీజ‌న్‌.. సంక్షేమ‌మేన‌ని.. ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి. వ‌చ్చే నెలలో ఉద్యోగుల‌కు వేత‌నాలు ఇవ్వ‌డంతోపాటు.. వైఎస్సార్ చేయూత కార్య‌క్ర‌మానికి నిధుల అవ‌స‌రం అయిందని తెలుస్తోంది.

ఈ చేయూత కింద‌.. బీసీ వ‌ర్గాల‌కు చెందిన మ‌హిళ‌ల‌కు ఏటా ఒకేసారి రూ.45 వేలు ఇస్తున్న విష‌యం తెలిసిందే. దీనికిగాను ఇప్పుడు అప్పులు చేసిన‌ట్టు స‌మాచారం. అదేస‌మ‌యంలో ద‌స‌రా నాటికి.. విశాఖ నుంచి పాల‌న ప్రారంభించాల్సి ఉన్న నేప‌థ్యంలో ఇత‌ర ఖ‌ర్చుల కింద కూడా ఈ నిధుల‌ను వెచ్చించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఏదేమైనా.. అప్పుల ప‌రంప‌ర‌లో ఏపీ దూకుడు.. ఊహించ‌ని విధంగా ఉంద‌ని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.