కేసీఆర్ మీద కేసు పెట్టే ధైర్యముందా?

ఒక వ్యక్తి మీద అవినీతి ఆరోపణలు వస్తే ఏం చేయాలి ? ఆ ఆరోపణలపై అధ్యయనం చేయాలి. అవినీతి జరిగిందని అనుమానమొస్తే శాఖాపరమైన విచారణ జరిపించాలి. అవినీతి నిర్ధారణైతే వెంటనే సదరు వ్యక్తిపై కేసు పెట్టి కోర్టులో ప్రవేశపెట్టాలి. మామూలుగా జరిగే విధానమిదే. మరిప్పుడు అలాంటిదేమీ లేకుండా డైరెక్టుగా సంబంధిత శాఖ మంత్రే ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని నిర్ధారిస్తే ఏమి చేయాలి ? వెంటనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై కేసు నమోదు చేయాలి, అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలి.

మరిపుడు కేసీయార్ ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టేంత ధైర్యం కేంద్ర ప్రభుత్వానికి ఉందా ? అన్నదే కీలకమైన ప్రశ్న. ఇపుడిదంతా ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని స్వయంగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రకటించారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి టీఆర్ఎస్ అవినీతి హద్దులన్నీ దాటేసిందని మంత్రి మండిపోయారు. ప్రాజెక్టుకు చట్టబద్దమైన అనుమతులు తీసుకోకుండానే టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మాణాలు చేసేసినట్లు మంత్రి ఆరోపించారు.

ప్రాజెక్టు నిర్మాణంలో ఇప్పటికే వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. మొన్నటి భారీ వర్షాలు, వరద కారణంగా పంపులు ముణిగిపోయాయని చెప్పి మరి కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతికి తెరలేపిందని రెచ్చిపోయారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే ప్రాజెక్టు నిర్మాణంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మంత్రే ధృవీకరించినాక కేసీయార్ పై కేంద్ర దర్యాప్తు సంస్ధలైన సీబీఐ లేదా ఈడీ ద్వారా కేసులు నమోదు చేయవచ్చు కదా ? అవినీతి జరిగిందని చెబుతున్నారంటే షెకావత్ దగ్గర అన్నీ ఆధారాలున్నట్లే అనుకోవాలి.

తన దగ్గరున్న ఆధారాలతో కేసీఆర్ పైన కేసు పెట్టి అరెస్టు చేయించచ్చుకదా ? ఇంకా ఎందుకు షెకావత్ కేవలం ఆరోపణలకే పరిమితమవుతున్నారు. తన శాఖ పరిధిలోనే వేల కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు నిర్దారణైతే చర్యలు తీసుకునేందుకు ఇంకా ఉపేక్షించాల్సిన అవసరం లేదు. కేసీయార్ మీద కేసులు పెట్టి అరెస్టు చేసి జైలులో పెట్టేస్తే హ్యాపీగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేయచ్చు కదా ? మరింకా ఎందుకు వెనకాడుతున్నారు ?