ఆ విష‌యంలో మోడీని జ‌గ‌న్ ఒప్పించేనా!

ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా..ఏపీలో సంక్షేమ ప‌థ‌కాలు.. ఉచిత ప‌థ‌కాల‌ను విస్మ‌రించే ప్ర‌య‌త్నం కానీ.. సాహ‌సం కానీ.. ఏ ఒక్క పార్టీ చేసే అవ‌కాశం లేదు. మ‌రీ ముఖ్యంగా ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న వైసీపీ అయితే.. ఏకంగా.. సంక్షేమాన్నే ఎన్నిక‌ల మంత్రంగా ప‌ఠిస్తోంది. రాష్ట్రంలో అభివృద్ధి లేకున్నా.. త‌మ‌ను త‌మ ప్ర‌భుత్వాన్ని సంక్షేమ ప‌థ‌కాలే ఆద‌రిస్తాయ‌నే విధంగా సీఎం జ‌గ‌న్ స‌హా వైసీపీ నాయ‌కులు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వేల కోట్ల అప్పులు చేసి మ‌రీ.. ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నారు.

అయితే.. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు మాత్రం సంక్షేమం మాటున ఉచిత ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డాన్ని తీవ్ర‌స్థాయిలో త‌ప్పుబ‌డుతోంది. సంక్షేమ ప‌థ‌కాల్లో కోత‌లు విధించాల‌ని.. ప్ర‌జ‌ల నుంచి ప‌న్నులు మ‌రింత పిండాల‌ని.. కేంద్రం ఇప్ప‌టికే రాష్ట్రాల‌ను ఆదేశించింది. ఇదే విష‌యాన్ని.. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా చెప్పుకొచ్చారు. సంక్షేమ ప‌థ‌కాలు.. ఉచిత ప‌థ‌కాల‌కు తేడా లేదా? అనేది బీజేపీ యేత‌ర పార్టీలు ఉన్న ప్ర‌భుత్వాలు చెబుతున్న మాట‌.

అయితే.. ఈ విష‌యంలో ఇత‌ర రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఎలా వ్యాఖ్యానించినా.. ఏపీ సీఎం కానీ.. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబు కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పైగా.. ఎవ‌రికి వారు మౌనంగా ఉన్నారు. ఎందుకంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సంక్షేమ ప‌థ‌కాలే.. ప్ర‌ధాన అజెండాగా ఈ రెండు పార్టీలు కూడా.. ముందుకు సాగ‌నున్నాయి. సంక్షేమాన్ని విస్మ‌రించి.. ఏ పార్టీ కూడా ముందుకు సాగే ప్ర‌య‌త్నం చేయ‌లేవు. ఈ క్ర‌మంలో కేంద్రంలోని మోడీని ఎవ‌రు మెప్పిస్తారు? అనేది ఇప్పుడు కీల‌క ప్ర‌శ్న‌గా మారింది.

ఎందుకంటే.. ఇప్ప‌టికే రాష్ట్రానికి ఇస్తున్న గ్రాంట్ల‌ను కేంద్రం నిలిపి వేసింది. అంతేకాదు. ఇస్తున్న ప్ర‌తి రూపాయికి కూడా లెక్క‌లు అడుగుతోంది. కొన‌సాగాల్సిన ప‌థ‌కాల‌కు కూడా రూపాయి అద‌నంగా ఇవ్వ‌డం లేదు. ఈ ప‌రిణామాలు ఒక‌వైపు.. ఏపీని తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నాయి. మ‌రోవైపు.. అప్పులు కూడా పెరిగిపోతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఖ‌చ్చితంగా సంక్షేమ ప‌థ‌కాలు తీసేయాల‌ని మోడీ ఆదేశిస్తే.. ఏం చేయాలనేది అంతుబ‌ట్ట‌ని విష‌యంగా మారిపోయింది. ఈ క్ర‌మంలో మోడీకి వ్య‌తిరేకంగా.. గ‌ళం విప్పుతారా?  లేక‌.. స‌ర్దుకుపోతారా? అనేది చూడాలి.