తెలంగాణలో ఒక్క ఎకరా ఏపీలో 3 ఎకరాలు

పేద‌ల నొరు కొట్టి.. సంక్షేమ ప‌థ‌కాల‌ను ఆపేసి.. జ‌మీందారుల‌కు.. బ‌డా వ్యాపారుల‌కు దోచి పెడ‌త‌డ‌ట‌. ఇదేనా మీ పాల‌న‌? ఈ ఎనిమిదేళ్ల పాల‌న‌లో ప్ర‌ధానిగా మోడీ చేసిందేమిటి?.. అని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. సూటి ప్ర‌శ్న‌లు సంధించారు. వికారా బాద్‌లో నిర్వ‌హించిన స‌భ‌లో ఆద్యంతం ఆయ‌న కేంద్రంపై నిప్పులు చెరిగారు. సంక్షేమ ప‌థ‌కాల‌ను ఉచితాలుగా చూస్తున్న ఘ‌న‌త మోడీకే ద‌క్కుతుంద‌ని వ్యాఖ్యానించారు.

తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా అమలవుతున్నాయా? అని కేసీఆర్‌ ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడకపోతే వికారాబాద్ జిల్లా అయ్యేదా? ఇచ్చిన మాట ప్రకారం వికారాబాద్‌ను జిల్లాగా చేశాం. రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు పడిపోయాయని ప్రచారం చేశారు. కర్ణాటక, ఏపీలో కంటే భూముల ధరలు తెలంగాణలో ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ లో ఒక్క ఎకరా అమ్మితే ఏపీలో మూడు ఎకరాలు కొనొచ్చు. సరిహద్దు పంచుకుంటున్న కర్ణాటక వాసులు తెలంగాణలో కలవాల ని కోరుకుంటున్నారు. తమ రాష్ట్రంలో కూడా తెలంగాణాలో లాగా సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతున్నారు.. అని వ్యాఖ్యానించారు.

కొత్తగా 10 లక్షల పింఛన్లు ఇవ్వడం ప్రారంభించామ‌ని చెప్పారు. రైతు బీమా కింద రూ. 5 లక్షలు ఇస్తున్నామ‌ని, ప్రాజెక్టులు ఉన్న చోట పన్ను లేకుండా నీళ్లు ఇస్తున్నామ‌ని సీఎం చెప్పారు. రైతు బంధు, రైతు బీమా పక్కగా అమలవుతున్నాయన్న ఆయ‌న‌… నాణ్యమైన కరెంటు ఇస్తున్నామ‌ని తెలిపారు. తాగునీరు, సాగునీరు, కరెంటు సమస్యలు లేవు. దేశంలో పంట పెట్టుబడి తీసుకుంటున్నది తెలంగాణ రైతు మాత్రమే. రైతు భీమా అందిస్తున్నఏకైక రాష్ట్రం తెలంగాణనే. గతంలో అనుభవించిన బాధాలు రావద్దంటూ రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. అని పిలుపునిచ్చారు.

మోడీతోనే త‌ల‌ప‌డ్డా!

తెలంగాణ కోసం దేశ ప్రధానినే ప్రశ్నించాన‌ని, మోడీతోనే త‌ల‌ప‌డ్డాన‌ని సీఎం కేసీఆర్ చెప్పారు. నిత్యావసరాలు, ఇంధన ధరల పెంపుతో ప్రజలపై భారం మోపారని నిప్పులు చెరిగారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పాలన ఒక్కసారి చూడండని ఆయ‌న సూచించారు. ఎనిమిదేళ్ల పాలనలో మోదీ చేసిందేమిటని ప్ర‌శ్నించారు… కేంద్రంలోని బీజేపీ ఏ ఒక్క మంచి పని చేసింది? మేలు చేయకపోగా.. రద్దు చేయాలని ఆదేశిస్తారు. సంస్కరణల పేరుతో మనకు శఠగోపం పెట్టి షావుకార్ల జేబులు నింపుతున్నారు.. అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

బీజేపీ జెండా మోసం..

ఉచిత పథకాలు రద్దు చేయమని సన్నాయి నొక్కులు నొక్కుతున్నార‌ని, పెద్దపెద్ద వ్యాపారులకు రూ. 20 లక్షల కోట్లు ఎన్‌పీఏలు ఇచ్చారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీ జెండాను చూసి మోసపోతే శఠగోపం పెడతార‌ని అన్నారు. ఉచిత కరెంటు వద్దంటున్న కేంద్రం బడా వ్యాపారులకు లక్షల కోట్లు మాఫీ చేసిందన్నారు. బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా ముందుకెళ్తున్నామ‌ని చెప్పారు. అన్ని రంగాల్లో తెలంగాణ పురోభివృద్ధి సాధిస్తుందని అన్నారు.