జయసుధ డిమాండ్లను బీజేపీ పట్టించుకుంటుందా ?

ప్రముఖ సినీనటి, మాజీ ఎంఎల్ఏ జయసుధ బీజేపీలో చేరుతున్నారా ? చేరుతున్నారనే ప్రచారం ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే తాను ఎన్నికల్లో పోటీ చేయటం లేదని స్వయంగా జయసుధే ప్రకటించారు.  ప్రచారం జరుగుతున్నట్లుగా తాను ఈ నెల 21వ తేదీన మునుగోడు బహిరంగ సభలో చేరటంలేదని కూడా క్లారిటి ఇచ్చారు. అంటే మునుగోడు సభలో చేరటం లేదని చెప్పారే కానీ అసలు బీజేపీలోనే చేరటం లేదని మాత్రం చెప్పలేదు.

అయితే పార్టీవర్గాల సమాచారం ప్రకారం తాను బీజేపీలో చేరాలన్నా, ఎన్నికల్లో పోటీచేయాలన్నా తన షరతులకు అంగీకరించాలని స్పష్టంగా చెప్పారట. ఇంతకీ ఆ షరతులు ఏమిటంటే తాను సికింద్రాబాద్ ఎంఎల్ఏగా కానీ లేదా ఎంపీగా కానీ పోటీచేస్తానని మాత్రమే చెప్పారట. అదికూడా తాను పై రెండు నియోజకవర్గాల్లో ఎక్కడ పోటీచేసినా మొత్తం ఖర్చును పార్టీయే భరించాలన్నారట. మరీ రెండు షరతులకు బీజేపీ అగ్రనేతలు అంగీకరిస్తారా లేదా అన్నది అనుమానంగా ఉంది.

అనుమానానికి కారణాలు ఏమిటంటే రెండు కారణాలున్నాయి. మొదటిది సికింద్రాబాద్ లోక్ సభ నుండి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కిషన్ను కాదని జయసుధకు బీజేపీ టికెట్ కేటాయిస్తుందా అన్నది పెద్ద అనుమానం. అలాగే మొత్తం ఖర్చును పార్టీయే భరించేట్లయితే ఇక జయసుధే ఎందుకు ఇంకా మంచి క్యాండిడేట్ నే చూసుకోవచ్చు. జయసుధేమీ జనాకర్షణ ఉన్న నేత కాదు. అసలు జయసుధ ఒకపుడు ఎంఎల్ఏగా పనిచేసారన్న విషయాన్ని కూడా జనాలకు గుర్తుండదు.

2009 ఎన్నికల్లో జయసుధ గెలిచారంటే అది కేవలం  వైఎస్సార్ చలవ వల్లే అని అందరికీ తెలుసు. ఆ తర్వాత కూడా రెండోసారి పోటీ చేసినా జయసుధ ఓడిపోయారు. తర్వాత టీడీపీలో చేరారు. కొంతకాలం తర్వాత రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అక్కడా ఇమడలేక చివరకు రాజకీయాలకే దూరంగా ఉంటున్నారు. ఇలాంటి నటిని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం బీజేపీకి ఉందా అన్నదే పెద్ద ప్రశ్న.