రౌడీషీటర్లు రెచ్చిపోయి 8 మంది పోలీసుల్ని కాల్చేశారు

ఉత్తరప్రదేశ్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కేవలం సినిమాల్లో మాత్రమే కనిపించే సీన్ ఇప్పుడు వాస్తవంగా చోటు చేసుకుంది. దేశంలో ఇప్పటివరకూ ఎప్పుడూ లేని రీతిలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ రోజు (శుక్రవారం) తెల్లవారుజామున చోటు చేసుకున్న వైనాన్ని యూపీ పోలీసులు మాత్రమే కాదు.. దేశ వ్యాప్తంగా ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.

కాన్పూరు శివారులో జరిగిన ఈ ఘటన పెనుసంచలనంగా మారింది. కాన్పూరు శివారులోని చైబెపూర్ లోని పోలీస్ స్టేషన్ పరిధిలో బిక్రూ గ్రామంలో వికాస్ దూబే అనే రౌడీ షీటర్ ను పట్టుకునేందుకు పోలీసుల బృందం వెళ్లింది. ఊహించని రీతిలో రౌడీషీటర్ బృందం పోలీసుల మీదకు కాల్పులకు తెగబడింది. ఊహించని ఈ పరిణామానికి సిద్ధంగా లేకపోవటంతో ఎనిమిది మంది పోలీసులు మరణించారు.

మరణించిన వారిలో డీఎస్పీ నుంచి కానిస్టేబుళ్ల వరకూ ఉండటం గమనార్హం. మరో నలుగురు సిబ్బంది గాయపడ్డారు. డీఎస్పీ దేవేంద్ర మిశ్రా.. ముగ్గురు ఎస్ఐలు.. నలుగురు కానిస్టేబుళ్లు రౌడీషీటర్ల కాల్పుల్లో మరణించినట్లు చెబుతున్నారు. ఈ ఉదంతం గురించి సమాచారం అందుకున్నంతనే అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్).. కాన్పూర్ ఎస్పీ.. ఐజీతో సహా ఇతర ఉన్నతాధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.

ఈ ఉదంతం పెను సంచలనంగా మారింది. పెద్ద ఎత్తున పోలీసుల్ని కాల్చివేసిన రౌడీషీటర్లను వెంటనే పట్టుకోవాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. జరిగిన ఘటనపై దిగ్భాంత్రి వ్యక్తం చేసిన ఆయన.. హుటాహుటిన అదనపు బలగాల్ని రంగంలోకి దించారు. ఈ మొత్తం ఉదంతంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నిందితుల్ని యుద్ధ ప్రాతిపదికన పట్టుకునేందుకు వీలుగా పెద్ద ఎత్తున గాలింపు చర్యల్ని పోలీసులు చేపట్టారు.