మోడీతో చంద్ర‌బాబు.. ర‌హ‌స్య చ‌ర్చ‌లు

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు చాలా నెల‌ల త‌ర్వాత‌.. మ‌ళ్లీ ఢిల్లీ బాట ప‌ట్టారు. ఈ ద‌ఫా ఆయ‌న‌కు బీజేపీ పెద్ద‌ల‌తో భేటీ ఉంటుంద‌నే అంచ‌నాలను నిజం చేస్తూ.. ఆయ‌న ప్ర‌ధాని మోడీతో ర‌హ‌స్యంగా భేటీ అయ్యారు. గ‌తంలో టీడీపీ ఆఫీసుపై వైసీపీ నాయ‌కులు కొంద‌రు క‌ర్ర‌లు, రాళ్ల‌తో దాడులు చేసిన విష‌యం తెలిసిందే. ఈ స‌మ‌యంలో చంద్ర‌బాబు ఒక రోజు దీక్ష కూడా చేశారు. అనంత‌రం.. ఆయ‌న ఢిల్లీ వెళ్లి.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీకి ప్ర‌య‌త్నించారు. అయితే.. అప్ప‌ట్లో ఆయ‌నకు ఆ అవ‌కాశం ద‌క్క‌లేదు. దీంతో రెండు రోజులు వేచి చూసి వెనుదిరిగారు.

మ‌ళ్లీ ఆ త‌ర్వాత‌.. వెళ్లాల‌ని అనుకున్నా.. చంద్ర‌బాబు వెనుక‌డుగు వేశారు. అయితే.. ఇప్పుడు ప‌రిస్థితులు మారాయ‌నే సంకేతాలు వ‌చ్చాయి. ఇటీవ‌ల రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో టీడీపీ అధినేత వ్య‌వ‌హ‌రించిన తీరుతో బీజేపీకి-చంద్ర‌బాబుకు మ‌ధ్య ఏర్ప‌డిన గ్యాప్ త‌గ్గుముఖం ప‌ట్టింద‌ని.. స్వ‌యంగా కేంద్ర మంత్రి జి. కిష‌న్‌రెడ్డి కూడా.. చంద్ర‌బాబు ప‌ట్ల సానుకూల దృక్ఫ‌థం ఏర్పడే విధంగా ఢిల్లీలో చ‌క్రం తిప్పుతున్నార‌ని.. కొన్నాళ్లుగా ఒక స‌మాచారం పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లో హ‌ల్చ‌ల్ చేస్తోంది. ఇక‌, రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో తాము కోర‌కుండానే ద్రౌప‌ది ముర్ముకు చంద్ర‌బాబు మ‌ద్ద‌తివ్వ‌డం ప‌ట్ల అమిత్ షా స‌హా బీజేపీ చీఫ్ న‌డ్డా కూడా హ్యాపీగానే ఉన్నార‌ని.. అప్ప‌ట్లో స‌మాచారం వ‌చ్చింది.

ఈ క్ర‌మంలో ఇప్పుడు చంద్ర‌బాబు తాజా ఢిల్లీ ప‌ర్య‌ట‌న చాలా ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌ధాని మోడీ తో ఆయ‌న ర‌హ‌స్యంగా భేటీ కావ‌డం.. రాష్ట్రంలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.  ఢిల్లీలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు.. సమావేశం తర్వాత ప్రధాని మోడీతో ప్రత్యేకంగా పలు అంశాలపై చర్చించారు. 5 నిమిషాలపాటు పలు అంశాలపై మోదీ, చంద్రబాబు మాట్లాడుకున్నార‌ని ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

జ‌గ‌న్‌లో ఆందోళ‌న అందుకే:  చంద్ర‌బాబు

కార్యక్రమం అనంతరం జాతీయ మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. జనం నాడి తెలిసి జగన్ ఆందోళనలో ఉన్నారని వ్యాఖ్యనించారు. వైసీపీ ప్రభుత్వానికి రాష్ట్ర అభివృద్ధిపై ధ్యాసే లేదని ఆక్షేపించారు. ఏపీ ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక మొత్తం వ్యవస్థలు నాశనం చేశారని దుయ్యబట్టారు. తమ హయాంలో పోలవరం, అమరావతికి నడుం బిగిస్తే.. జగన్ అధికారంలోకి వచ్చాక రెండింటినీ నాశనం చేశారని మండిపడ్డారు. అనేక విపత్తులు ఎదురైనా మనదేశం ధైర్యంగా నిలబడిందని అన్నారు. అనేక దేశాల కంటే మనదేశ తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని అన్నారు.