లేట్ కాదు…అరుదైన ఫీట్ సాధించిన ఇండియన్ రైల్వేస్

మన భారతీయ రైళ్లు సరైన సమయానికి ప్లాట్ ఫాం చేరుకున్న ఘటనలు దాదాపుగా లేవు. ఇండియన్ పంక్చువాలిటీ అన్నది…బహుశా రైళ్ల సమయపాలన నుంచి వచ్చింది కాబోలు. ట్రైన్ నంబర్….ఫలానా…ఫలానా….ఒక గంట ఆలస్యంగా వచ్చే సంభావన ఉందంటూ వచ్చీ రాని తెలుగులో వినబడే స్తోత్రం….రైలు ప్రయాణికులుకు మా చెడ్డ చిరాకు తెప్పిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

రెండు మూడు నెలలు ముందుగా రిజర్వేషన్ చేసుకొని ఏసీ కోచ్ లో ప్రయాణించే ధనికుడైనా…..అదే రోజు క్యూలో గంటలతరబడి నిలబడి టికెట్ కొనుక్కుని సెకండ్ క్లాస్ లో ప్రయాణించే పేదవాడైనా….రైలు కోసం పడిగాపులుగాయడంలో మాత్రం తేడా ఉండదు. అటువంటి ఇండియన్ రైల్వే పంక్చువాలిటీని బ్రేక్ చేస్తూ….భారతీయ రైల్వే సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. లాక్ డౌన్ పుణ్యమా అంటూ పరిమిత సంఖ్యలో నడుస్తోన్న రైళ్లన్నీ గురువారం నాడు సరైన సమయానికి గమ్యస్థానాలకు చేరుకొని చరిత్ర సృష్టించాయి.

భారతీయ రైల్వే చరిత్రలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలో ప్రస్తుతం నడుస్తోన్న రైళ్లు 100కు100 శాతం సరైన సమయానికి తమ తమ గమ్యస్థానాలకు చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా 13000 రైళ్లు ఉన్నాయి. అయితే, లాక్ డౌన్ కారణంగా అందులో 2 శాతం కన్నా తక్కువ…అంటే కేవలం 230 ప్రత్యే రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. దీంతో, పరిమిత సంఖ్యలో నడుస్తోన్న 230 ప్రత్యేక రైళ్లు కచ్చితమైన సమయానికి గమ్యస్థానాలకు చేరాలని రైల్వే శాఖ ఆయా జోన్లను ఆదేశించింది. రైళ్ల సంఖ్య తక్కువే కాబట్టి ఆలస్యం కావొద్దని అధికారులు స్పష్టం చేశారు.

దీంతో, జూన్ 23, 2020న ఒక రైలు మినహా అన్ని రైళ్లు సమయానికి ఆయా గమ్య స్థానాలకు చేరుకున్న శాతం 99.54 నమోదైంది. ఈ నేపథ్యంలోనే గురువారం నాడు అన్ని రైళ్లు సరైన సమయానికి గమ్య స్థానాలకు చేరుకోవడంతో..100 శాతం రికార్డు నమోదైంది. మరోవైపు, రైల్వే ప్రైవేటీకరణ దిశగా కేంద్రం కీలక అడుగు వేసింది. మొత్తం 109 రూట్లలో ప్రైవేట్ ప్యాసింజర్ రైళ్లకు అనుమతిచ్చిన కేంద్రం… పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేట్ సంస్థలను ఆహ్వానించింది. ఆ రైళ్లకు 35 ఏళ్ల పాటు ప్రభుత్వ రాయితీలు అందుతాయి. ఈ ప్రైవేట్ రైళ్లలోనూ భారతీయ రైల్వేకు చెందిన లోకో పైలట్, గార్డ్ విధులు నిర్వహిస్తారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రైలు ప్రయాణ అనుభూతి కలిగించాలన్న ఉద్దేశంతోనే రైల్వేలోకి ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు కేంద్రం తెలిపింది.