పరీక్షలు చేయటంలో పాస్.. ఫలితాల విషయంలో ఏపీ ఫెయిల్?

ఒక రాష్ట్రానికి నాలుగు వందల వాహనాల్ని ప్రత్యేకంగా సిద్ధం చేసి.. రోజువారీగా పెద్ద ఎత్తున కరోనా టెస్ట్ శాంపిల్స్ ను ప్రజల వద్ద నుంచి సేకరిస్తున్న జగన్ సర్కారు విషయం తెలిసిందే. రోజులో తక్కువలో తక్కువ పాతికవేల వరకు నిర్దారణ పరీక్షలు చేస్తూ.. మిగిలిన రాష్ట్రాలకు కంటగింపుగా మారింది జగన్ ప్రభుత్వం. టెస్టులు చేసే విషయంలో పక్కా ప్లానింగ్ తో ఉన్న ఏపీ ప్రభుత్వం.. వాటి ఫలితాల్ని వెల్లడించే విషయంలో మాత్రం తప్పులో కాలేస్తున్నట్లుగా చెప్పాలి.

ముందుగా అనుకున్న దాని ప్రకారం టెస్టులు చేయించుకున్న వారికి పాజిటివ్ లేదంటే నెగిటివ్.. ఫలితం ఏమైందన్న విషయాన్ని ఇరవైనాలుగు గంటల వ్యవధిలోనే ఇచ్చేయాలని డిసైడ్ చేశారు. అయితే.. పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిష్తున్న నేపథ్యంలో ఫలితాల్ని వెల్లడించటం కష్టంగా ఉందని చెబుతున్నారు. సాంకేతిక సమస్యలతో పాటు.. సిబ్బంది కొరత కూడా కరోనా పరీక్షా ఫలితాల వెల్లడిలో ఆలస్యమయ్యేలా చేస్తున్నాయి.

విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏపీలో పలితాలు వెల్లడించాల్సిన శాంపిళ్లు ఏకంగా లక్ష మేర ఉన్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో కొన్ని జిల్లాల్లో వేలాది సంఖ్యలో ఫలితాలు వెల్లడించకుండా పెండింగ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. మరోవైపు ప్రజల విషయానికి వస్తే..

శాంపిల్ ఇచ్చేశాం.. తమకేం ఫర్లేదన్న రీతిలో ఏపీ ప్రజలు వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. పరీక్షలకు నమూనాల్ని ఇచ్చి రావటంతో తమ బాధ్యత అయిపోయిందన్న భావనలో ఉండటం ఏ మాత్రం సరికాదని చెప్పక తప్పదు. నమూనాల్ని ఇచ్చిన వారు ఫలితాలు వచ్చే వరకూ ఇళ్లకే పరిమితం కావాలి. అందుకు భిన్నంగా వారిలో ఎక్కువమంది బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఫలితాలు వచ్చిన తర్వాతే బయటకు రావాలన్న సూచన పలువురి నోట వ్యక్తమవుతోంది.

ఏమైనా.. నమూనాల సేకరణ విషయంలో తిరుగులేని రీతిలో పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న జగన్ సర్కారు.. ఫలితాల వెల్లడి విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని చెబుతున్నారు. ఈ విషయంలో జరిగే తప్పులు.. ఏపీలో కేసులు పెరిగేందుకు కారణమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.మరీ.. విషయంలో సీఎం జగన్ ఎలా రియాక్ట్ అవుతారో?