యుద్ధప్రాతిపదికన భారత్ కు 2000 బాంబులు.. ఇజ్రాయిల్ రెఢీ

నోరు మంచిదైతే ఊరు మంచిదని ఊరికే అనలేదు. తాను ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలుదేశాలకు స్వయంగా వెళ్లిన ప్రధానమంత్రి మోడీ.. అందరికి స్నేహహస్తాన్ని చాచటమే కాదు.. అందరితోనూ కలుపుకుపోయే గుణాన్ని ప్రదర్శించారు. అంతేకాదు.. దశాబ్దాలకు దశాబ్దాల పర్యంతం ప్రధాని హోదాలో వెళ్లని దేశాలకు వెళ్లటం ద్వారా మోడీ పలు రికార్డుల్ని క్రియేట్ చేశారు. ఒకట్రెండు ఏళ్ల పాటు అదే పనిగా పలు దేశాల్లో పర్యటించటం ద్వారా స్నేహసంబంధాల్ని పటిష్టం చేసుకోవటంలో సక్సెస్ అయిన మోడీకి.. ఇప్పుడవన్ని సమయానికి కలిసి వస్తున్నాయి.

ఇటీవల చైనా.. పాక్ లతో భారత్ ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో.. యుద్ధ ప్రాతిపదికన స్పైస్2000 బాంబుల్ని భారత వైమానిక దళానికి ఇచ్చేందుకు ఇజ్రాయిల్ సిద్ధమైంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి అనుమతుల అవసరం లేకుండానే రూ.500 కోట్ల లోపు ఆయుధాల్ని కొనుగోలు చేసుకునేందుకు భారత రక్షణ దళాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది.

గత ఏడాది పాక్ లోని బాలకోట్ లోని తీవ్రవాద స్థావరాలపై నిర్వహించిన సర్జికల్ స్టైక్స్ లో వినియోగించిన బాంబులు ఇవే. వీటినిఫ్రాన్స్ లో తయారైన మిరాజ్ 2000 జెట్స్ ద్వారా వినియోగిస్తారు. గగనతలం నుంచి భూతలంలోని లక్ష్యాన్ని ఛేదించేందుకు ఈ బాంబులు సాయం చేస్తాయి. శత్రుదేశాల బంకర్లు.. భవంతుల్ని క్షణాల్లో పూర్తిగా నేలమట్టం చేసే సామర్థ్యం ఈ బాంబుల సొంతం.

ఈ బాంబుల్ని ఇప్పటికే భారత్ కొనుగోలు చేసింది. గత ఏడాది కొనుగోలు చేసిన దానికి అదనంగా మరోసారి ఈ బాంబుల్ని కొనుగోలు చేస్తోంది. స్సైస్ అంటే స్మార్ట్.. ప్రిసైజ్.. ఇంపాక్ట్.. కాస్ట్ ఎఫెక్టివ్ గా ఈ బాంబుల్ని అభివర్ణిస్తారు. ఇదిలా ఉంటే.. భారత్ కుఅవసరమైన రాఫెల్ యుద్ధ విమానాల్ని కూడా ఈ నెలాఖరు నాటికి భారత్ కు పంపుతామని ఫ్రాన్స్ సైతం చెప్పటం తెలిసిందే. ఈ విమానాలతో భారత్ మరింత శక్తివంతం కావటం ఖాయం.