వైసీపీ పేరులో `వైఎస్సార్`తీసేయాలని ఈసీకి ఫిర్యాదు

ఎన్నికల గుర్తులు….పార్టీల జెండాలు…పేర్ల గురించిన వివాదాలు తరచూ జరుగుతూనే ఉంటాయి. సాధారణంగా ఎన్నికలకు ముందు ఇటువంటి వ్యవహారాలు తెరపైకి వస్తుంటాయి. తమ గుర్తును పోలి ఉన్న గుర్తు ఉండడం వల్ల ఓడిపోయామంటూ ఈసీకి ఫిర్యాదు చేసిన ఘటనలు తెలంగాణాలో జరిగాయి. ఇక, వైసీపీ జెండాను పోలినట్లుగా జెండాను రూపొందించారంటూ ఏపీలో ప్రజాశాంతి పార్టీపై ఆరోపణలు వచ్చాయి. అయితే, తాజాగా ఎన్నికల పూర్తయిన ఏడాది తర్వాత అనూహ్యంగా ఏపీలో మరోసారి పార్టీ పేర్లలో పోలిక వ్యవహారం చర్చనీయాంశమైంది. అది కూడా అధికార వైసీపీ మీద అన్నవైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఫిర్యాదు చేశారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరును వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీగా చలామణీ అవుతోందని కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన ఫిర్యాదు చేశారు. అంతేకాదు, వైఎస్సార్ అనే పదాన్ని వైసీపీ వాడకుండా చూడాలని ఈసీని కోరానని మహబూబ్‌బాషా తెలిపారు.

వైఎస్సార్ అనే పదంతో చాలా ఏళ్ల క్రితం నమోదైన ఏకైక పార్టీ తనదేనని అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అని మహబూబ్ బాషా అన్నారు. వైకాపా అధికార పత్రాలపై యువజన శ్రామిక పార్టీ అని పూర్తి పేరు రాయడం లేదని, వైఎస్సార్ అని తమ పార్టీని ప్రతిబింబించేలా రాయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. ఓ ఎంపీకి వైసీపీ ఇచ్చిన షోకాజ్ నోటీసులో వైఎస్సార్ అని రాశారని, అది తమ పార్టీనే అన్న భావన కలుగుతోందని అన్నారువ. వైఎస్సార్ అనే పదం ఇతర పార్టీలు వాడకూడదంటూ గతంలోనే ఎస్ఈసీ స్పష్టం చేసిందని మహబూబ్ బాషా గుర్తు చేశారు. అయితే, ఇటీవల వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ నోటీసులో వైఎస్సార్ అన్న పదం ఉండడంతో…ఈ విషయం తెరపైకి వచ్చింది. మరి, ఈ వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు ఏ విధంగా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.