హైదరాబాద్‌లో 11 ఉచిత కరోనా కేంద్రాలు

కరోనా పరీక్షల విషయంలో ముందు నుంచి తెలంగాణ వెనుకబడే ఉంది. పరీక్షలు పెంచే విషయంలో ప్రభుత్వం ఏ రోజూ సుముఖత ప్రదర్శించలేదు. పక్కన ఆంధ్రప్రదేశ్‌లో లక్షల్లో పరీక్షలు జరుగుతుంటే ఇక్కడ అందులో పదోవంతుకు పరీక్షలు పరిమితం అయ్యాయి. చివరికి హైకోర్టు జోక్యం చేసుకుని ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. హైదరాబాద్‌తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో 50 వేల ఉచిత పరీక్షలు చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. అలా పరీక్షలు చేయడంతోనే గత రెండు వారాల్లో భారీగా కేసులు బయటికి వచ్చాయి. ఐతే ఈ ఉచిత పరీక్షలకు ఉన్నట్లుండి మళ్లీ బ్రేక్ వేయడంతో విమర్శలు వచ్చాయి. ఆందోళన వ్యక్తమైంది. దీనిపై బుధవారం హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ఐతే కోర్టు ఆగ్రహం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించింది. మళ్లీ పెద్ద ఎత్తున పరీక్షలు చేయడానికి నిర్ణయించింది. ఈసారి ప్రభుత్వం ఎంపిక చేసిన వాళ్లకు పరీక్షలు చేయడం కాకుండా.. తెలంగాణలో తొలిసారిగా ప్రజలు స్వచ్ఛందంగా పరీక్ష కేంద్రానికి వెళ్లి ఉచితంగా కరోనా టెస్ట్ చేయించుకునే అవకాశం కల్పించారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న హైదరాబాద్‌లో ఇందుకోసం 11 కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. అవి ఎక్కడెక్కడో కూడా వెల్లడించారు ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్. కోఠిలోని కింగ్ కోఠి హాస్పిటల్, నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రి, ఎర్రగడ్డలోని చెస్ట్ హాస్పిటల్, అమీర్ పేటలోని నేచుర్ క్యూర్ ఆసుపత్రి, మెహదీపట్నంలోని సరోజిని దేవి ఐ హాస్పిటల్, ఎర్రగట్డలోని ఆయుర్వేదిక్ హాస్పిటల్, రామంతపూర్‌లోని హోమియోపతి హాస్పిటల్, చార్మినార్‌లోని నిజామియా టిబ్బి హాస్పిటల్, కొండాపూర్‌లోని ఏరియా ఆసుపత్రి, వనస్థలి పురంలోని ఏరియా ఆసుపత్రి, నాచారంలోని ఈఎస్ఐ హాస్పిటల్‌లో కరోనా ఉచిత పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. కరోనా లక్షణాలున్నవారు అక్కడికెళ్లి ఉచితంగా పరీక్ష చేయించుకోవచ్చు.