కేంద్రం దూకుడును ఎలా అడ్డుకుందాం.. జ‌గ‌న్ అంత‌ర్మ‌థ‌నం

తాజాగా రెండు రోజుల కింద నుంచి కేంద్ర ప్ర‌భుత్వం నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తోంది. అత్యంత కీల‌క‌మైన రెండు విష‌యాల్లో కేంద్రం రాష్ట్రంపై ఫైర్ అయింది. అంతేకాదు.. తీవ్ర‌స్థాయిలో వ్యాఖ్య‌లు కూడా చేసింది. ఇదే స‌మ‌యంలో జాతీయ మీడియా కూడా ప‌లు వ్య‌తిరేక క‌థ‌నాల‌ను ప్ర‌చారం చేసింది. వీటిలో ప్ర‌ధానంగా ఏపీ అప్పుల కుప్ప‌గా మారిపోతోంద‌ని.. కేంద్రం గ‌ణాంకాల స‌యితంగా వెల్ల‌డించింది. దేశంలో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అధికంగా అప్పులు చేస్తున్న‌ట్టు చెప్పింది.

దీనికి కొన‌సాగింపుగా.. పార్ల‌మెంటులో జ‌ల‌శ‌క్తి మంత్రి, ఇత‌ర మంత్రులు కూడా.. పోల‌వ‌రం విష‌యంపై రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని క‌డిగిపారేశారు. పోల‌వ‌రం జాప్యం వెనుక‌.. త‌మ త‌ప్పు లేనేలేద‌ని.. అంతా రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తున్న త‌ప్పేన‌ని.. నిఖార్స‌యిన ప్ర‌ణాళిక లేకుండా రాష్ట్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విదానాల కార‌ణంగానే పోల‌వ‌రం ఆల‌స్యం అవుతోంద‌ని.. కేంద్రం పార్ల‌మెంటు సాక్షిగా .. కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది. ఈ ప‌రిణామం.. వైసీపీ అధినేత‌.. సీఎం జ‌గ‌న్‌కు తీవ్ర త‌ల‌నొప్పిగా మారింది.

ఇక‌, కేంద్ర‌మే ఇలా అన్నాక‌.. రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షాలు ఊరుకుంటాయా? అవి ఎంత ప‌నిచేయాలో అంతా చేశాయి. ఈ నేప‌థ్యంలో సీఎం జ‌గ‌న్ త‌న‌కు అత్యంత స‌న్నిహితులుగా ఉన్న ఓ ఇద్ద‌రు స‌ల‌హాదారులు.. పార్టీ నాయ‌కుల‌తో నిర్వ‌హించిన ర‌హ‌స్య స‌మావేశంలో ఈ విష‌యంలోపై ఆవేద‌న చెందిన‌ట్టు స‌మాచారం “కేంద్రానికి మ‌నం ఎంతో చేస్తున్నాం.. అడిగినా.. అడ‌గ‌క‌పోయినా..సాయం అందిస్తున్నాం. ఇలా మ‌న‌ల్ని రోడ్డున ప‌డేస్తే.. ఎలా! ఈ విష‌యాన్ని ఢిల్లీ పెద్ద‌ల‌కు చేర‌వేయాలి” అని ఆయ‌న అన్న‌ట్టుగా తాడేప‌ల్లి వ‌ర్గాలు గుస‌గుస‌లాడుతున్నాయి.

ఇక‌, ఇదే అంశంపై ఎలా ముందుకు వెళ్లాలి? వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. ఈ స‌మ‌స్య‌ల‌నుంచి ఎలా బ‌య‌ట ప‌డాల‌నే అంశంపైనా.. సీఎం జ‌గ‌న్ దృష్టి పెట్టిన‌ట్టు స‌మాచారం. ఢిల్లీ వ‌ర్గాల‌ను క‌ట్ట‌డి చేసేందుకు.. ముఖ్యంగా త‌న పాల‌న‌పై వ్య‌తిరేక వ్యాఖ్య‌లు చేయ‌కుండా ఉండేలా చేసేందుకు.. ఏం చేస్తే.. మంచిద‌నే అంశంపై ఆయ‌న దృష్టి పెట్టిన‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. “ఇప్ప‌టికి మేం చేయాల్సిందంతా చేస్తూనే ఉన్నాం. అయినా.. మాపై క‌త్తిక‌ట్టిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం స‌మంజ‌సం కాదు. ఇదివారు ఆలోచించుకోవాలి!” అని ఓ ముఖ్య స‌ల‌హాదారుడు మీడియాతోనే వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. ఏదేమైనా.. కేంద్రం వైఖ‌రిపై జ‌గ‌న్ యూటర్న్‌తీసుకుంటారా? లేక‌.. ఏం చేస్తారు? అనేది ఆస‌క్తిగా మారింది.