ఎన్నికలకు జనసేన ఎంతవరకు సిద్ధం ?

వచ్చే ఎన్నికల్లో జనసేన జెండా ఎగరేయటం ఖాయమట. 2024 ఎన్నికలకు జనసేన సిద్ధంగా ఉందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మండపేటలో ప్రకటించారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి తలా లక్ష రూపాయలు ఇచ్చారు. ఈ నేపధ్యంలోనే బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి జనసేన ధ్యేయమన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న వంద తప్పులను భరిస్తాం, సహిస్తామని హెచ్చరించారు. తర్వాత ప్రభుత్వం తాటతీయటం ఖాయమన్నారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ గనుక మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారమైపోవటం ఖాయమని మండిపడ్డారు. సరే రాజకీయ ఉపన్యాసంగా పవన్ చాలా విషయాలు చెప్పారు. అంతా బాగానే ఉంది కానీ వచ్చే ఎన్నికలకు జనసేన సిద్ధమని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. జనసేన ఏ విధంగా సిద్ధంగా ఉందని పవన్ చెప్పారో అర్ధం కావటం లేదు. వచ్చే ఎన్నికల్లో జనసేన పొత్తులో పోటీ చేస్తుందా లేకపోతే ఒంటరిగా పోటీ చేస్తుందా అనే విషయంపైనే క్లారిటీ లేదు.

పార్టీకి అసలు గ్రామస్థాయి కమిటిలే లేవు. రేపటి ఎన్నికల్లో జనాలను పోలింగ్ కేంద్రాల దాకా తీసుకొచ్చి జనసేనకు ఓట్లేయించే యంత్రాంగమే పార్టీకి లేదు. పలానా నియోజకవర్గంలో పార్టీ తరపున పోటీ చేయబోయే గట్టి అభ్యర్ధి అని ఒక్కరు కూడా లేరు. ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరిగితే ఒక పద్దతిలో ఉంటుంది. అలాకాదని ఇప్పటికప్పుడు జరిగితే అభ్యర్ధుల ఎంపిక విషయంలో జనసేన చేతులెత్తేయాల్సిందే.

పార్టీ పెట్టి ఇంతకాలమైనా జనసేనకు ఓట్లేసి గెలిపించండని అడగటమే పవన్ కు తెలీటం లేదు. ఎంతసేపు జగన్ కు ఓటేయద్దు, వైసీపీని ఓడించమనే పాటే వినిపిస్తున్నారు. ఇపుడు కూడా సభలో మాట్లాడుతూ గోదావరి జిల్లా జనాలు బాగా చైతన్యవంతులని, ఎవరికి ఓట్లేయాలో బాగా తెలుసని చెబుతునే ఎవరికి ఓట్లేయాలో తేల్చుకోమని జనాలకు బంపరాఫర్ ఇచ్చారు. జనసేనను జనాలు ఎందుకు గెలిపించాలి ? జనసేనను గెలిపిస్తే వచ్చే ఉపయోగాలేమిటి అనే విషయంలో పవన్ కే సరైన క్లారిటీ లేదు. ఇలాంటి వ్యక్తి కూడా ఎన్నికలకు జనసేన సిద్ధమని చెబితే ఎవరు నమ్ముతారు ?