కొత్త జిల్లాల‌కు 100 రోజులు.. జ‌నాల‌కు ఒరిగిందేంటి?

చెప్పాడంటే చేస్తాడంతే! అనే నినాదంతో వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను కొనియాడే ఆ పార్టీనాయ‌కులు.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల‌కు ఇప్పుడు పెద్ద చిక్కు వ‌చ్చింది. జ‌గ‌న్ చెప్పిన‌ట్టే.. రాష్ట్రంలోని 13 జిల్లాల ను 26 జిల్లాలుగా మార్చారు. ఈ క్ర‌మంలో కొన్ని వివాదాలు.. విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. లెక్క చేయ‌కుండా జిల్లాల విభ‌జ‌న‌చేశారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే.. ఈ జిల్లాల విభ‌జ‌న‌కు 100 రోజులు పూర్తయ్యాయి. ఇంత వ‌ర‌కుబాగానే ఉంది.

మ‌రి జ‌గ‌న్ ఆశించింది జ‌రిగినా.. జ‌నాల‌కు ఒరిగిందేంట‌నేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాల‌న మ‌రింత చేరువ అవుతుంద‌ని.. ప్ర‌జ‌ల‌కు అత్యంత స‌మీపంలోనే అధికారులు ఉంటార‌ని.. వారికి ప‌నులు కూడా అవుతాయ‌ని.. ప్ర‌భుత్వం చెప్పింది. కానీ, 100 రోజులు గ‌డిచినా.. ఎక్క‌డా అలాంటి వాతావర‌ణం క‌నిపించ‌డం లేద‌ని.. ప్ర‌జ‌లు చెబుతున్నారు. ఇక‌, అధికారులు కూడా ఆయా జిల్లాల్లో ఎక్క‌డా ఉండడం లేదు. వారు ఉండేందుకు.. ప‌నిచేసేందుకు చేయాల్సిన ఏర్పాట్లు లేవు.

దీంతో అధికారులు కానీ.. సిబ్బంది కానీ.. మ‌ళ్లీ పాత ప‌ద్ధితినే అనుస‌రిస్తున్నారు. ఇక‌, ప్ర‌జ‌లు కూడా ఏ కార్యాల‌యాల‌నికి వెళ్లాలో తెలియ‌క తిక‌మ‌క‌ప‌డుతున్నారు. గ‌తంలో జిల్లా కేంద్రంలోనే అన్నీ ఉండేవి. కానీ, ఇప్పుడు జిల్లా కేంద్రంలో ఏ ఆఫీసు ఎక్క‌డుందో.. ఏ అధికారిని క‌ల‌వాలో తెలియ‌క ప్ర‌జ‌లు తిప్ప‌లు పడుత‌న్నారు. కొత్త జిల్లాల‌ను అయితే.. ఆర్భాటంగా ప్ర‌క‌టించారు కానీ.. ఆ జిల్లాల‌కు సంబంధించిన మౌలిక సదుపాయాల‌ను ఏర్పాటు చేయ‌డం లో స‌ర్కారు విఫ‌ల‌మైంది.

ఇక‌, అదేస‌మ‌యంలో జిల్లాల‌పై అధికారుల‌కు కూడా ప‌ట్టులేద‌నే వినిపిస్తోంది. ముఖ్యంగా మంత్రులు కూడా ఆఫీసులను ప‌ట్టించుకోవ‌డం లేదు. గుంటూరులోని ప‌ల్నాడు, ప‌శ్చిమ‌లోని అల్లూరి సీతారామ‌రాజు జిల్లా వంటి చోట్ల ఇంకా.. క‌నీసం కార్యాల‌యాల‌ను కూడా చూపించ‌క‌పోవ‌డంతో ఇప్పుడున్న జిల్లా కేంద్రా ల్లోనే పనులు చేస్తున్నారు. మ‌రి అధికారుల‌కే ఇన్ని తిప్ప‌లు ఉంటే.. సామాన్య ప్ర‌జ‌ల ప‌రిస్థితి ఏంట‌నేది ప్ర‌శ్న‌. మ‌రి జిల్లాల ఏర్పాటుపై ఉన్న దూకుడు.. త‌ర్వాత లేదా? అనే సందేహాలు వ్యక్త‌మ‌వుతున్నాయి. ఇదంతా చూస్తే.. తాంబూలాలిచ్చేశాం.. త‌న్నుకు చావండి.. అన్న‌ట్టుగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.