మోడీ అవివేకి.. అస‌మ‌ర్థుడు..: కేసీఆర్‌

కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీపై తెలంగాణ సీఎం కేసీఆర్.. తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోడీ.. దేశంలో అవివేక, అసమర్థ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం దేశంలో అప్రకటిత ఎమ‌ర్జెన్సీ పరిస్థితి నడుస్తోందని కేసీఆర్‌ స్పష్టం చేశారు. సర్కారు నడుపుతున్నారా?.. గూండాయిజం చలాయిస్తున్నారా? అని నిలదీశారు.

దేశాన్ని బీజేపీ జలగలా పట్టి పీడిస్తోందని కేసీఆర్‌ ధ్వజమెత్తారు. “ప్రధాని మోడీ అవివేకి. అస‌మ‌ర్థుడు.. అలానే.. అవివేక, అసమర్థ పాలన కొనసాగిస్తున్నారు” అని విమర్శించారు. టీఆర్ఎస్‌ లేవనెత్తిన ప్రశ్నలకు జాతీయ కార్యవర్గ భేటీలో ఏ ఒక్కరూ సమాధానం చెప్పలేదని పేర్కొన్నారు. అశక్తులం అని తమ డొల్లతనాన్ని బీజేపీ రుజువు చేసుకుందన్నారు. చేతగాని కేంద్ర ప్రభుత్వాన్ని కచ్చితంగా మారుస్తామన్నారు.

డబుల్‌ ఇంజిన్‌ సర్కారు రావాలని మోడీ చెప్పినట్టు గుర్తు చేసిన కేసీఆర్.. ఈ విషయంలో మోడీకి థ్యాంక్స్‌ చెబుతున్నాట్టు తెలిపారు. తెలంగాణ సర్కారు ఇంజిన్‌ స్పీడ్‌గా ఉందని.. కేంద్రంలో కూడా తెలంగాణ సర్కారులా స్పీడ్‌గా ఉన్న డ‌బుల్ ఇంజ‌న్‌ ప్రభుత్వం రావాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు. మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూపాయి విలువ పతనమైందని గొంతు చించుకుని చెప్పారన్నారు. ఇప్పుడు రూపాయి విలువ ఎందుకు పడిపోయిందో ఆయనే చెప్పాలన్నారు.

గతంలో మోడీ చెప్పిన విషయాన్నే ఇప్పుడు మేమూ అడుగుతున్నామ‌న్నారు. బీజేపీ అసమర్థత వల్లే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.80కి పడిపోయిందని దుయ్య‌బ‌ట్టారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మోడీ హయాంలో రూపాయి విలువ పతనమైందని కేసీఆర్ విమ‌ర్శించారు. దేశానికి మోడీ చేసిన మంచి పని ఒక్కటైనా చెప్పగలరా? అని నిల‌దీశారు. తెలంగాణ తప్ప దేశమంతా దారుణ‌మైన‌ పవర్‌ పాలసీ తీసుకొచ్చారని అన్నారు.

సాగునీరు ఇవ్వలేరు, తాగునీరు ఇవ్వడం చేతకాదని దుయ్య‌బ‌ట్టారు. దేశంలో 70వేల టీఎంసీల నీళ్లు ఉన్నాయన్న కేసీఆర్‌.. ఇవ్వడం కూడా చేతకాదా? అని ప్ర‌శ్నించారు. దేశ రాజధానిలో కరెంటు కోతలు, మంచినీటి కొరత ఉందన్నారు. ఇదే మీ పాలనకు నిదర్శనమ‌ని, తెలంగాణలో జరిగే అభివృద్ధిలో కనీసం 10శాతమైనా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతోందా? అని ప్ర‌శ్నించారు. సమర్థ విధానాల వల్ల దేశాన్ని ఆగం పట్టించారని అన్నారు. రూపాయి పతనం ఆపలేరని, నిరుద్యోగాన్ని కట్టడి చేయలేరని లొల్లి పెట్టడం ఒక్కటే మీక చేతనైందని నిప్పులు చెరిగారు.