చిత్తూరు.. వివాదాలు టీడీపీ, బాబుకి ప‌రీక్షేనా..?

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలో టీడీపీ ప‌రిస్థితి దారుణంగా త‌యారైంద‌ని.. త‌మ్ముళ్ల మ‌ద్య వివాదాలు, విభేదాలు కొన‌సాగుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ముఖ్యంగా ఈ జిల్లాను మూడుగా చేయ‌డంతో నాయ‌కుల మ‌ధ్య ఇప్పుడు ఆధిప‌త్య పోరు మ‌రింత‌గా పెరిగిపోయింద‌ని చెబుతున్నారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆయా స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారించాల‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం మూడు జిల్లాలుగా విడిపోయిన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ ప్రస్తుతం చిత్రమైన పరిస్థితిని ఎదుర్కుంటోంది.

2019 ఎన్నికల్లో వైఫల్యాన్ని మూటగట్టుకున్న ఈ ప్రాంతంలోని తెలుగుదేశం క్యాడర్‌, ఇప్పుడు సమరోత్సాహంతో ఉరకలు వేస్తోంది. ఓటమి తర్వాత తొలి ఏడాది మాట పెగలని స్థితిలో ఉండిపోయిన నాయకులు, రెండో ఏడాది కాస్త కాలు బయటపెట్టారు. మూడో ఏడాది పిడికిలి బిగించి సవాలు చేస్తున్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామంటూ భరోసా ఇస్తున్నారు.

అధికార వైసీపీ పాలనను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. నిద్రాణంగా ఉన్న సింహం జూలు విదిలించుకుంటున్నట్టుగా ఉంది పరిస్థితి. అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అనేక నియోజకవ ర్గాల్లో నాయకత్వం విషయంలో అధినేత నుంచీ కొనసాగుతున్న అస్పష్టత పార్టీకి నష్టం చేస్తోంది. ఎక్కడ ఎవరు నాయకులో ప్రకటించి ముందుకు కదిలితే కదనోత్సాహంతో క్యాడర్‌ కూడా బలంగా నిలుస్తుంది. మూడు రోజులపాటూ ఉమ్మడి జిల్లాలో చంద్రబాబు దృష్టి సారించాల‌నే డిమాండ్లు కూడా వ‌స్తున్నాయి.

చిత్తూరు, పూతలపట్టు, జీడీనెల్లూరు నియోజకవర్గాల్లో ఎన్నికలను ఎదుర్కొనే బాధ్యులు ఎవరన్న స్పష్టత లేదు. చిత్తూరు నుంచీ గత ఎన్నికల్లో పోటీ చేసిన ఏఎస్‌ మనోహర్‌ ఎన్నికల తర్వాత పార్టీకి రాజీనామా చేశారు. అప్పటి నుంచీ అక్కడ ఇంఛార్జి లేరు. సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ దొరబాబు పెద్దదిక్కుగా మారి శ్రేణులకు అందుబాటులో వుంటున్నారు. పూతలపట్టు నుంచీ గత ఎన్నికల్లో పోటీచేసిన లలితకుమారి సైతం ఎన్నికల తర్వాత పార్టీని విడిచిపెట్టారు. అప్పటి నుంచీ ఆ సెగ్మెంట్‌కు కూడా ఇంఛార్జి లేరు.

మండల స్థాయి నేతలు తప్ప నియోజకవర్గమంతా పార్టీని నడిపే నేత లేరు. దీంతో ఈ సెగ్మెంట్‌ను కూడా దొరబాబే పర్యవేక్షిస్తున్నారు. జీడీ నెల్లూరులో కిందటి ఎన్నికల్లో పోటీ చేసిన హరికృష్ణ తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. దీంతో అధిష్ఠానం ఈ రిజర్వుడు సెగ్మెంట్‌కు కమ్మ సామాజికవర్గానికి చెందిన చిట్టిబాబును సమన్వయకర్తగా నియమించింది. అయితే మండలస్థాయి నేతల నడుమ సరైన సమన్వయం ఇక్కడ ఇప్పటికీ లేదు. ఈ నేప‌థ్యంలో నాయ‌కుల మ‌ధ్య‌స‌ఖ్య‌త లోపించింద‌నే వాద‌న జోరుగా వినిపిస్తున్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఏం చేస్తారో చూడాలి.