మొదలైన అక్కా-తమ్ముళ్ళ మధ్య వార్ ?

తెలంగాణా కాంగ్రెస్ లో ప్రతిరోజు ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉండాలి. వివాదాలు లేకపోతే పార్టీకి దిష్టి తగులుతుందన్నట్లుగా అయిపోయింది పార్టీ పరిస్ధితి. ఇంతకీ విషయం ఏమిటంటే గ్రేటర్ హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం టికెట్ కోసం అక్కా తమ్ముళ్ళ మధ్యే వార్ మొదలైనట్లుంది. దివంగత ఎంఎల్ఏ పీజేఆర్ కూతురు ఖైరతాబాద్ టీఆర్ఎస్ కార్పొరేటర్ విజయారెడ్డి ఈ మధ్యనే కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే.

జూబ్లీహిల్స్ మాజీ ఎంఎల్ఏ, పీజేఆర్ కొడుకు విష్ణువర్ధనరెడ్డికి విజయ స్వయాన అక్క. వీళ్ళిద్దరు చెరో పార్టీలో ఉన్నారు కాబట్టి సమస్య రాలేదు. అయితే కొంతకాలంగా విష్ణు పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనబడటంలేదు. పార్టీలోని సీనియర్లతో కూడా అంటీ ముట్టనట్లే ఉంటున్నారు. ఒక విధంగా పార్టీ తరపున జూబ్లిహిల్స్ నియోజకవర్గానికి ఇంచార్జ్ గా ఉన్నారా లేదా అన్న అనుమానం పార్టీలోనే ఉంది.

ఇలాంటి పరిస్ధితుల్లోనే విజయ పార్టీలో చేరారు. బహుశా వచ్చే ఎన్నికల్లో టికెట్ విషయమై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లున్నారు. అందుకనే ఆమె పార్టీలో చేరారు. ఎప్పుడైతే అక్క పార్టీలో చేరారో వెంటనే తమ్ముడిలో చురుకుపుట్టింది. తాను పార్టీలో ఉండగా తన సోదరిని ఎందుకు చేర్చుకున్నారు ? తనకు చెప్పకుండా చేర్చుకోవటం ఏమిటంటు ఇపుడు రేవంత్ పై మండుతున్నాడు. అసలు విష్ణు తొందరలోనే టీఆర్ఎస్ లో చేరిపోతారనే ప్రచారం జరిగినా దాన్ని ఆయన ఖండించలేదు.

దాంతో ముందుజాగ్రత్తగా రేవంత్ కార్పొరేటర్ విజయను పార్టీలోకి తీసుకున్నారు. దాంతో ఇపుడు అక్కా-తమ్ముళ్ళ మధ్యే గొడవలు మొదలయ్యాయి. అసలు వీళ్ళిద్దరికీ చాలాకాలంగా మాటలు కూడా లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇపుడేమైందంటే విజయకు మద్దతుగా రేవంత్ నిలబడ్డారు. ఇదే సమయంలో విష్ణు కు మద్దతుగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మరికొందరు నిలబడ్డారు. దాంతో ముందు ముందు ఈ వివాదం బాగా ముదిరేట్లే కనబడుతోంది.