కేసీయార్ వెనక్కు తగ్గుతున్నారా ?

క్షేత్రస్థాయిలో ను, పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. తెలంగాణా రాష్ట్ర సమితిని జాతీయ స్ధాయికి విస్తరించాలని కేసీయార్ చాలా బలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే టీఆర్ఎస్ ను భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చేందుకు ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు. అయితే ఊహించని రీతిలో టీఆర్ఎస్ లోనే సమస్యలు బయట పడుతుండటంతో బీఆర్ఎస్ ఆలోచనను కొంతకాలం వాయిదా వేసుకున్నట్లు అనుమానంగా ఉంది.

నిజానికి జాతీయ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించేంత స్ధాయి కేసీయార్ కు లేదు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు కానీ లేదా జాతీయ పార్టీలు కానీ కేసీయార్ ను పూర్తిగా నమ్మటం లేదు. జాతీయ రాజకీయాల్లో కేసీయార్ ట్రాక్ రికార్డు ఏమంత గొప్పగా లేదన్నది వాస్తవం. అందుకనే నరేంద్ర మోడికి వ్యతిరేకంగా కేసీయార్ ఎందరు ముఖ్యమంత్రులను కలిసినా, జాతీయ స్థాయి నేతలను కలిసినా ఎవరు కూడా పెద్దగా ప్రోత్సాహకరంగా మాట్లాడలేదు.

దాంతో కొంతకాలంగా ఎవరితోను కలవకుండా ఒంటరిగానే ఉంటున్నారు. నాన్ ఎన్డీయే పార్టీల ఉమ్మడి అభ్యర్ధిగా రాష్ట్రపతి పదవికి పోటీచేస్తున్న యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమానికి కూడా తాను వెళ్లకుండా కొడుకు కేటీయార్ ను ఎంపీలను పంపారు. ఇలాంటి సమయంలోనే టీఆర్ఎస్ లోని విభేదాలు బయపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జనాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోతోందని సర్వే నివేదికలు చెప్పాయి. దాంతో ముందు ఇంటిని చక్కదిద్దుకోకుండా జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి లాభం లేదని కేసీయార్ అనుకున్నారట.

అందుకనే బీఆర్ఎస్ వ్యవహారాన్ని కొంతకాలం దూరంగా పెట్టి ముందు టీఆర్ఎస్ వ్యవహారాన్ని చూసుకోవటానికే డిసైడ్ అయ్యారట. నియోజకవర్గాల వారీగా సమీక్షలు పెట్టి ఎంఎల్ఏల పనితీరు, ఎంఎల్ఏల అభ్యర్ధుల ఎంపిక, జనాల్లో వ్యతిరేకతను తగ్గించుకోవటం, మళ్ళీ జనాధరణ పెంచుకోవటం అనే అంశాలపైనే దృష్టి పెట్టబోతున్నారట. రేపటి ఎన్నికల్లో కేసీయార్ అధికారంలోకి రాకపోతే ఎప్పటికీ బీఆర్ఎస్ కల సాకారం అయ్యే అవకాశాలు లేవనే చెప్పాలి. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే ముందు రాష్ట్రంలో అధికారంలో ఉండాల్సిందే. లేకపోతే అంతే సంగతులు.