పీఎం కార్య‌క్ర‌మానికి పిలిచి.. టీడీపీని ఇలా అవ‌మానించారే!

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని భీమ‌వ‌రంలో అత్యంత వైభ‌వంగా నిర్వ‌హించిన అల్లూరి సీతారామ‌రాజు 125వ జ‌యంతి కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి ఘోర అవ‌మానం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మాన్ని.. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు సంయుక్తంగా నిర్వ‌హించాయి. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం టీడీపీని ఆహ్వానించాల్సి ఉంది. అయిన‌ప్ప‌టికీ.. ఆహ్వానించ‌లేదు. దీంతో కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి, తెలుగు వాడు.. జి. కిష‌న్‌రెడ్డి.. స్వ‌యంగా చంద్ర‌బాబుకు ఫోన్ చేసి.. ఆహ్వానించారు.

ఆహ్వాన ప‌త్రిక కూడా పంపించారు. ఈ క్ర‌మంలో బాబు త‌న‌కు బ‌దులుగా.. ఏపీ టీడీపీ అద్య‌క్షుడు అచ్చె న్నాయుడును ఈ కార్య‌క్ర‌మానికి పంపించారు. ఈ క్ర‌మంలో అచ్చెన్నకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేసి హెలిప్యాడ్‌కు రావాల్సిందిగా ఆహ్వానం పలికారు. దీంతో ఇత‌ర‌త్రా ప‌నులు ఉన్నా.. వాటిని ప‌క్క‌న పెట్టిన అచ్చెన్నాయుడు.. వెంట‌నే ఈ కార్య‌క్ర‌మం కోసం.. ఒక రోజు ముందుగా వ‌చ్చి.. న‌ర‌సాపురంలోనే బ‌స చేశారు.

అనంత‌రం.. సోమ‌వారం ఉద‌యం.. ఆయ‌న భీమ‌వ‌రం బ‌య‌లు దేర‌గా.. ఆయ‌న‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్ర‌మంలో అచ్చెన్నాయుడు.. జిల్లా క‌లెక్ట‌ర్‌కు పోన్ చేయ‌గా.. తనకు వచ్చిన లిస్టులో అచ్చెన్న పేరు లేదని జిల్లా కలెక్టర్ చెప్పారు. ప్రధాని భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ డీఐజి ఇచ్చిన జాబితాలో అచ్చెన్నాయుడు పేరు ఉంది. కానీ, రాష్ట్ర ప్ర‌భుత్వం రెడీ చేసుకున్న జాబితాలో మాత్రం పేరు లేదు.

ఈ నేప‌థ్యంలో త‌న‌ను కేంద్ర‌మే ఆహ్వానించింద‌ని.. త‌న పేరు ఉంద‌ని అచ్చెన్న స్వ‌యంగా కలెక్టర్‌కు చెప్పినప్పటికీ తనకు రాష్ట్ర స‌ర్కారు ఇచ్చిన‌ జాబితాలో లేదని ఆయన తేల్చిచెప్పేశారు. కేంద్ర మంత్రి చెప్పినా జిల్లా అధికారులు పట్టించుకోకపోవడంతో కేంద్ర అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ జాబితాలో పేరు లేదని చెప్పటంతో బసచేసిన ప్రాంతంలోనే అచ్చెనాయుడు ఆగిపోయారు. ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆహ్వానించి అవమానించడం ఏమిటని మండిపడుతున్నారు.