అందరికంటే ముందే అభ్యర్ధులను వైసీపీ ప్రకటించేస్తోందా ?

పార్టీ ప్లీనరీ సమావేశాల్లోనే అధికార వైసీపీ అభ్యర్థులను ప్రకటించేస్తోందా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటివరకు వివిధ జిల్లాల్లోని నలుగురు నేతల పేర్లను వచ్చే ఎన్నికల్లో అభ్యర్ధులుగా పార్టీ ఇన్చార్జిలు ప్రకటించేశారు. ఈ ప్రకటనలను కూడా జగన్మోహన్ రెడ్డి చెబితేనే తాము చేసినట్లు వాళ్ళు స్పష్టంగా చెప్పారు. దాంతో అభ్యర్ధుల ప్రకటనలో జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

మొదట కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో వల్లభనేని వంశీయే పోటీ చేస్తారని మాజీ మంత్రి కొడాలి నాని ప్రకటించారు. గన్నవరం టికెట్ విషయంలో పార్టీలో పెద్ద వివాదమే నడుస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ ఎంఎల్ఏ అయిన వంశీకి వైసీపీ టికెట్ కేటాయించేసింది. అలాగే కుప్పంలో ఎంఎల్సీ భరత్ పోటీ చేయబోతున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లాలో జనసేన ఎంఎల్ఏ రాపాక వరప్రసాద్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ఇన్చార్జి సతీష్ ప్రకటించారు.

వీళ్ళే కాకుండా మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా అభ్యర్ధులను ప్రకటించేయమని జగన్ జిల్లాల సమన్వయ కర్తలను ఆదేశించారట. వచ్చే అక్టోబర్ నాటికి చాలావరకు అభ్యర్ధులను ప్రకటించేయాలని జగన్ టార్గెట్ గా పెట్టుకున్నట్లు సమాచారం. దీనివల్ల సమస్య లేదన్నా వస్తే సమన్వయకర్తలు, మంత్రులే కూర్చుని పరిష్కరించుకోవాలని కూడా జగన్ చెప్పారట. అంటే టికెట్ల కేటాయింపు, సమస్యలు, పరిష్కారాల్లాంటి వాటిల్లో జగన్ జోక్యం చేసుకోదలచుకోలేదని అర్ధమైపోతోంది.

ఎక్కడైనా వివాదాస్పదమైన నియోజకవర్గాల్లో అది కూడా తాను జోక్యం చేసుకుంటే కానీ సాధ్యం కాదన్న నియోజకవర్గాల్లో మాత్రమే జగన్ జోక్యం చేసుకోవాలని అనుకున్నారట. అందుకనే ప్లీనరీ సమావేశాల్లోనే కొందరి పోటీ విషయమై ఇన్చార్జీలే స్పష్టత ఇచ్చేస్తున్నారు. ఇపుడు ప్రకటించిన గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో ఒకరికి మించి నేతలు పోటీ పడుతున్నారు. మరీ నియోజకవర్గాల్లో తన జోక్యం అవసరం లేదని జగన్ అనుకున్నట్లున్నారు. అంటే టికెట్లు ప్రకటించిన వారి విషయంలో ఎవరైనా అసంతృప్తిగా ఉంటే వాళ్ళ దారి వాళ్ళు చూసుకోవచ్చన్న సంకేతాలే కనబడుతున్నాయి. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.