పేప‌ర్ కొనుక్కుని చ‌ద‌వండి.. వ‌లంటీర్ల‌ కు నెలకు 5.32 కోట్లు ?

విప‌క్షాన్ని ఎదుర్కొనేందుకు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కొత్త సూత్రాన్ని తెర‌పైకి తెస్తున్నారు. త‌న‌దైన శైలిలో ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను క‌ట్ట‌డి చేసేందుకు, ముఖ్యంగా ప‌థ‌కాల అమ‌లులో విప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌లు తిప్పికొట్టేందుకు ఒక కొత్త వ్యూహం రాస్తున్నారు. ఇందులో భాగంగా వలంటీర్ల‌ను ఉప‌యోగించుకోనున్నారు. ముఖ్యంగా వ‌లంటీరు వ్య‌వ‌స్థ‌కు స‌రైన అవ‌గాహ‌న, అధ్యయనం ఉండేవిధంగా చర్య‌లు చెప్పట్టేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

ఇందులోభాగంగానే రాష్ట్రంలో లీడింగ్ లో ఉన్న ఓ పేప‌ర్ ను నెల నెల కొనుగోలు చేసి చ‌దివేందుకు వీలుగా వ‌లంటీర్ల‌కు కొంత మొత్తాన్ని ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. ఈ మేర‌కు జీఓ కూడా విడుద‌ల చేశారు. దీని ప్ర‌కారం వ‌లంటీర్లు దిన‌ప‌త్రిక‌లు కొనుగోలు చదివేందుకు నెల‌కు రెండు వంద‌ల రూపాయ‌లు ఒక్కొక్క‌రికీ చెల్లించేందుకు ప్ర‌భుత్వం ముందుకు వ‌చ్చింది. ఇందుకోసం ఖ‌జానాకు ఆర్థిక భారం అయినా భ‌రించేందుకు సిద్ధంగా ఉంది. తాజా ఉత్త‌ర్వులు 2022 జూలై నుంచి 2023మార్చి వ‌ర‌కూ అమల్లో ఉండ‌నున్నాయి. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2.66 ల‌క్ష‌ల మంది వ‌లంటీర్లు ఉన్నారు. ఒక్కొక్క‌రికీ నెల‌కు రెండు వంద‌ల రూపాయ‌ల చొప్పున చెల్లించాలంటే 5.32 కోట్లు అవ‌సరం అవుతాయి. ఇది కేవ‌లం తొమ్మిది నెల‌ల‌కు మాత్ర‌మే సంబంధించిన ఖ‌ర్చు. త‌రువాత ఈ జీఓను కొన‌సాగించ‌నున్నారు కూడా !

తాజా నిర్ణ‌యం కార‌ణంగా ఖ‌జానాకు 47.88 కోట్ల రూపాయ‌లు అద‌న‌పు భారం. ఈ జీఓ ప్ర‌కారం.. ప్ర‌భుత్వ పథ‌కాల‌లో ఉన్న మార్పులూ, చేర్పులూ వ‌లంటీర్లు తెలుసుకుని, ప‌త్రిక‌ల్లో వ‌స్తున్న సమాచారంతో విప‌క్షాల ప్ర‌చారాన్ని తిప్పికొట్టాల్సి ఉంది. అప్పుడే వారంతా ప్ర‌జ‌ల్లో ఉన్న భ‌యాందోళ‌న‌ల‌ను తిప్పికొట్ట‌గ‌ల‌రు అన్న భావ‌న‌తో ప్ర‌భుత్వం ఉంది. ఇప్ప‌టికే వ‌లంటీర్ల‌కు గౌర‌వ వేత‌నం కింద ఏడాదికి 1596 కోట్లు వెచ్చిస్తున్నారు. వీటితో పాటు టెలిఫోన్ బిల్లు కింద 31.92 కోట్ల రూపాయ‌లు చెల్లిస్తున్నారు.

అదేవిధంగా వ‌లంటీర్ల‌కు సేవా వ‌జ్ర, సేవా ర‌త్న పేరిట అవార్డులు అందించే నిమిత్తం 250 కోట్ల రూపాయ‌లు వెచ్చిస్తున్నారు. ఇప్పుడు తాజాగా మ‌రో యాభై కోట్లు (సుమారు) చెల్లించేందుకు సర్కారు సిద్ధం అవుతోంది. వాస్త‌వానికి ఎప్ప‌టి నుంచో త‌మ జీతాలు పెంచ‌మ‌ని, త‌మ‌పై ప‌ని ఒత్తిడి ఉంద‌ని ప‌దే ప‌దే వేడుకుంటున్నా ప‌ట్టించుకోని ప్ర‌భుత్వం.. తాజాగా న్యూస్ పేప‌ర్ కొనుగోలు ఖ‌ర్చుల నిమిత్తం కొంత మొత్తం విద‌ల్చ‌డంపై సంబంధిత వ‌ర్గాల్లో విమ‌ర్శ‌లు రేగుతున్నాయి. ఐదు వేలు ఉన్న జీతం ఎనిమిది వేలు చేస్తామ‌ని చెప్పార‌ని, కానీ ఇప్ప‌టిదాకా అతీగతీ లేకుండాపోయింద‌ని, గ‌డ‌ప‌గ‌డప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంతో త‌మ‌పై ఒత్తిడి పెంచుతున్నార‌ని సంబంధిత వ‌ర్గాలు త‌మ త‌ర‌ఫు వాద‌న బ‌లీయంగా వినిపిస్తున్నాయి.

ఇదంతా ఓకే గాని… ఇపుడు ఒక పత్రిక కొనడానికి మాత్రమే డబ్బులు ఇస్తోంది ప్రభుత్వం. వారు ఆ డబ్బులతో ఇపుడు ఏ దినపత్రిక కొనాలి. సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతిలో గవర్నమెంటులో పనిచేస్తున్న వలంటీర్లు ఏ పత్రికను కొనాలో ఈపాటికే డిసైడ్ అయి ఉంటుంది కదా. వారు ఏ పత్రిక కొంటారో కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. అంటే ఈ జీవో విడుదలతో లాభం ఎవరికి?