కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ మారదా ?

కాంగ్రెస్ పార్టీ మారుతుందని అనుకోవడం ఉత్త భ్రమలాగే ఉంది. నేతి బీరకాయలో నెయ్యి ఎంతుంటుందో కాంగ్రెస్ నేతల్లో ఐకమత్యం, డిసిప్లిన్ అంతే ఉంటుంది. ఇంతకీ విషయం ఏమిటంటే నాన్ ఎన్డీయే పార్టీల ఉమ్మడి అభ్యర్ధిగా యశ్వంత్ సిన్హా హైదరాబాద్ రాక సందర్భంగా పార్టీలోని విభేదాలు మరోసారి భగ్గుమని రోడ్డున పడ్డాయి. సిన్హా విమానాశ్రయానికి వచ్చినపుడు కేసీయార్ అండ్ కో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు కూడా స్వాగతం పలికారు. ఇదే పార్టీలో విభేదాలు కారణమైంది. యశ్వంత్ కు స్వాగతం పలకటానికి కాంగ్రెస్ నేతలెవరు విమానాశ్రయానికి వెళ్ళకూడదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందే నేతలను ఆదేశించారు. అయితే అందుకు విరుద్ధంగా వీహెచ్ ఎయిర్ పోర్టుకెళ్ళి మరీ స్వాగతం పలికారు. రేవంత్ ఎందుకు వద్దన్నారంటే సిన్హాకు స్వాగతం పలికేందుకు కేసీయార్ అండ్ కో వస్తుంది కాబట్టి ఆ సమయంలో అక్కడ తామెందుకనేది రేవంత్ ఉద్దేశ్యం.

సిన్హాతో ప్రత్యేకించి కాంగ్రెస్ సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు రేవంత్ తెలిపారు. ఆ సమావేశంలోనే సిన్హాకు సన్మానం చేయాలని కూడా డిసైడ్ చేశారు. అయితే రేవంత్ ఆదేశాలను వీహెచ్ పట్టించుకోకుండా విమానాశ్రయానికి వెళ్ళటమే ఇపుడు పెద్ద వివాదామైంది. ఈ వివాదంలో రేవంత్ కు మద్దతుగా కొందరు, రేవంత్ ను వ్యతిరేకిస్తు మరికొందరు నేతలు బాహాటంగానే మాటల యుద్ధానికి దిగేశారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే కాంగ్రెస్ పార్టీలో ఒకరు చెబితే ఇంకొకళ్ళు వినేపద్దతిలేదు. పైగా రేవంత్ వద్దని చెప్పిందాన్ని చేయటానికి కొందరు సీనియర్లు రెడీగా కాచుక్కూర్చునుంటారు. ఇలాంటి వాళ్ళల్లో వీహెచ్ కూడా ఒకరు. అసలే రేవంత్ అంటే కొందరు సీనియర్లకు ఏమాత్రంపడదు. అందుకనే రేవంత్ చెప్పిందానికి కావాలనే వ్యతిరేకం చేస్తారు. ఈ పార్టీలో ఎవరినీ ఎవరు కంట్రోల్ చేసేంత సీన్ లేదుకాబట్టే నేతల్లో క్రమశిక్షణ బ్రహ్మాండంగా కనబడుతుంటుంది.