ఏపీ ఉద్యోగుల‌కు షాక్‌.. రేపటిలోగా ఫ్లాట్లు ఖాళీ చేయండి..

మూలిగే న‌క్క‌మీద తాడిపండు ప‌డిన చందంగా మారిపోయింది ఏపీ ఉద్యోగుల ప‌రిస్థితి. పీఆర్సీ స‌రిగా లేద‌ని.. గ‌త 2019 ఎన్నిక‌ల్లో ఇచ్చిన సీపీఎస్ పింఛ‌న్ ర‌ద్దు హామీని నెర‌వేర్చ‌డం లేద‌ని.. తాము భ‌విష్య‌త్తు అవ‌స‌రాల కోసం.. దాచుకున్న జీపీఎఫ్ నిధుల‌ను రూ.800 కోట్ల‌ను కూడా స‌ర్కారు సొంతానికి వాడేసుకుంద‌ని ల‌బోదిబోమంటున్న ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ పై స‌ర్కారు మ‌రో పిడుగు వేసింది. వారి పై కొర‌డా ఝ‌ళిపించింది. త‌క్ష‌ణం వెళ్లిపోవాలి.. అంటూ.. ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. ఇక‌పై వారంలో 5 రోజులు ప‌నిచేయాల‌ని కూడా చెప్ప‌డానికి రెడీ అయింది. దీంతో ఉద్యోగుల ప‌రిస్థితి పెనంపై నుంచి పొయ్యిలోకి ప‌డిన‌ట్టు అయింద‌నే వాద‌న వినిపిస్తోంది.

హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగులకు ఇచ్చిన ఉచిత వసతిని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఇందుకు సంబంధించి.. సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రేపటిలోగా ఉద్యోగులు ఉంటున్న ఫ్లాట్లను ఖాళీ చేసి.. మంచి స్థితిలో అప్పగించాలని(ఏమైనా రిపేర్లు ఉంటే ఉద్యోగ కుటుంబాలే చేయించాలి) జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్(జీడీఏ) ఆదేశించింది. ఏమైనా నష్టం జరిగితే సంబంధిత ఉద్యోగులదే బాధ్యత అని ఉత్తర్వుల్లో పేర్కొంది. చేయించ‌క‌పోతే.. జీతాల నుంచి రిక‌వ‌రీ చేస్తామ‌ని తెలిపింది.

మ‌రోవైపు.. అత్యంత కీల‌క‌మైన‌ సచివాలయం, హెచ్ఓడీ ఉద్యోగులకు కొనసాగుతున్న వారానికి ఐదు రోజుల పనిదినాల విధానం.. ఈ నెల 27 తేదీతో ముగిసింది. మరి, ఇకమీదట ఎలాంటి విధానం కొనసాగనుంది అనే విషయంలో క్లారిటీ లేదు. గడువు ముగిసి రెండు రోజులైనా.. ఇప్పటి వరకూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వలేదు. దీంతో.. ఐదు రోజుల పనిదినాల విధానం కొనసాగుతుందా? లేదా? అనే ఉత్కంఠ ఉద్యోగుల్లో నెలకొంది.

జూలై రెండో తేదీ శనివారం అవుతోంది. ఐదు రోజుల విధానం కొనసాగితే.. ఆ రోజు ఉద్యోగులకు సెలవు లభిస్తుంది. కానీ.. ఇప్పటి వరకూ సర్కారు స్పష్టత ఇవ్వకపోవడంతో.. ఆ రోజున విధులకు రావాలా? లేదా? అనే సందిగ్ధంలో ఉన్నారు సచివాలయం, హెచ్ఓడీ ఉద్యోగులు. మరో రెండు రోజులే గడువు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాలి. దీంతో ఉద్యోగులు ల‌బోదిబో మంటున్నారు.