ఆదాయం వ‌స్తోంది.. అప్పులూ చేస్తున్నారు.. కానీ.. ఖ‌జానా ఖాళీ

ఏపీ స‌ర్కారు ఆర్థిక మాయాజాలం ఎవ‌రికీ అర్ధం కావ‌డం లేదు. ఒక‌వైపు ఆదాయం వ‌స్తోంది. మ‌రోవైపు.. కేంద్రం చ‌ల్ల‌ని చూపుతో అప్పులు కూడా చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఖ‌జానాలో చిల్లిగ‌వ్వ ఉండ‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు వెతుకులాటే. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? డ‌బ్బులు ఎటు పోతున్నాయి? ఇదో విక్ర‌మార్క విన్యాసంగా మారిపోయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ప్రస్తుతం ఏపీలోని వైసీపీ ప్రభుత్వానికి నెలకు సగటున రూ.12వేల కోట్ల వరకు ఆదాయం వస్తోంది. అలాగే… సగటున నెలకు రూ.10 వేల కోట్ల అప్పు చేస్తోంది. వెరసి… ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో(ఏప్రిల్‌-జూన్‌) ఈ మూడు నెల ల్లో దాదాపు రూ.36,000 కోట్ల ఆదాయం, రూ.30వేల కోట్లు అప్పు! అయినా సరే… ఖజానా ఖాళీయే. అప్పులు, ఆదాయం రూపంలో భారీగా డబ్బులు వస్తున్నా… డ‌బ్బులు లేవ‌నే మాటే వినిపిస్తోంది. మ‌రి ఈ సొమ్మంతా ఎటు పోతోంది. పోనీ.. సంక్షేమానికే ఇచ్చేస్తున్నామ‌ని చెబుతున్నా.. ఏటికేడు ల‌బ్ధిదారుల సంఖ్య‌లో కోత‌పెడుతున్నారు.

దీంతో ఏపీ స‌ర్కారు చేస్తున్న ఆర్థిక మాయాజాలంపై అనేక అనుమానాలు ముసురుకున్నాయి. ఏప్రిల్‌ నెలలో కొత్త అప్పు చేసుకునేందుకు కేంద్రం నుంచి అనుమతి రాలేదు. దీంతో గత ఆర్థిక సంవత్సరంలో చేయకుండా మిగిలిన పరిమితి పేరుతో రూ.4,390 కోట్ల ప్రత్యేక అనుమతులు తెచ్చుకుని అప్పు చేసింది. మే నెలలో రూ.9,500 కోట్లు, జూన్‌లో రూ.8,000 కోట్లు తెచ్చారు. తాజాగా మంగళవారం రూ.3,000 కోట్ల అప్పు తెచ్చారు. ఇవి కాకుండా బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా జూన్‌లో రూ.8,300 కోట్ల అప్పు చేశారు.

దీనిపై 9.7% భారీ వడ్డీ పడింది. కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.28,000 కోట్లు అప్పు చేసుకునేందుకు అనుమతిచ్చింది. ఈ పరిమితిలో రూ.25,800 కోట్లు అప్పు తెచ్చారు. కానీ, సర్కార్‌ మాత్రం బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వా రా తెచ్చిన రూ.8,300 కోట్లను దీనిలో చూపలేదు. రాష్ట్రం, కార్పొరేషన్లు చేేస అన్ని అప్పులు ఈ పరిమితిలోకే రావాలని కేంద్రం, ఏజీ కార్యాలయం లేఖలు రాస్తున్నా స్పందించడం లేదు. ఈ విషయం తెలిసి కూడా కేంద్రం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు.

రాష్ట్ర ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం చూసినా కేంద్రం ఇచ్చిన అనుమతిలో ఇప్పటి వరకు రూ.17,500 కోట్ల అప్పు చేసేశారు. ఆర్థిక సంవత్సరంలో ఇంకా 9 నెలలు మిగిలే ఉన్నాయి. మిగిలిన రుణ పరిమితి రూ.10,500 కోట్లు మాత్రమే! మ‌రి ఇంత అప్పు చేస్తున్నా.. నిధులు ఏమ‌వుతున్నాయి? వ‌చ్చే 9 నెల‌ల పాటు స‌ర్కారును ఎలా నెట్టుకొస్తారు? అనే చ‌ర్చ మేధావి వ‌ర్గాల్లోనే కాదు.. వైసీపీ వ‌ర్గాల్లోనూ..జోరుగా సాగుతుండ‌డంగ‌మ‌నార్హం.