‘మొగుళ్లు వద్దన్నా వారి పెళ్లాలే మాకు ఓటేస్తారు’

నోటికి ఎంత మాట వ‌స్తే.. అంత అనేస్తున్న వైసీపీ నాయ‌కులు. నాలుగు గోడ‌ల మ‌ధ్య‌మాట్లాడుకోవాల్సిన వ్యాఖ్య‌లను కూడా బ‌హిరంగ వేదిక‌ల‌పై నోరు జారేస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే, సీనియ‌ర్ నాయకుడు చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర సంచ‌ల‌నంగా మారాయి. మొగుళ్లు వద్దన్నా వారి పెళ్లాలే మాకు ఓటేస్తారు. సంక్షేమ ప‌థ‌కాల కింద వేల‌కు వేలు ఇస్తున్నాం.. మాకు కాకుండా ఎవ‌రికి ఓటేస్తారు. అస‌లు అంత ద‌మ్ము ఎవ‌రికి ఉంది! అని స‌ద‌రు ఎమ్మెల్యే వ్యాఖ్యానించే స‌రికి స‌భ‌లో ఉన్న‌వారంతా అవాక్క‌య్యారు.

తాజాగా నంద్యాల జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన శ్రీశైలం నియోజకవర్గ వైసీపీ ప్లీనరీలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల మహిళలే తమకు ఓటు వేస్తారని అన్నారు. సంక్షేమ పథకాల అమలుతో సీఎం జగన్‌ నడిసముద్రంలో చిక్కుకున్నారని, ఆయన్ని మీరే దాటించాలని జనాన్ని కోరారు. సోషల్‌ మీడియాలో వైసీపీకి వ్యతిరేకంగా పోస్టులు వస్తే కార్యకర్తలుకూడా అదేస్థాయిలో ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.

ఎవడు బ‌డితే వాడు.. పోస్టులు పెడుతున్నాడు. జ‌గ‌న్ అంటే అంత అలుసా రా.. మీకు. 151 మందిని గెలిపించుకున్న వైసీపీ అంటే.. చుల‌క‌నారా మీకు! మీ అంతు తేల్చేందుకు మా కార్య‌క‌ర్త‌లు కూడా సిద్ధంగానే ఉన్నారు అని చ‌క్ర‌పాణి రెడ్డి నోరు పారేసుకున్నారు. ఇక‌, ఇదే కార్య‌క్ర‌మంలో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ బీజేపీ విధానాల వల్లే పెట్రోలు, గ్యాస్‌, నిత్యావసరాల ధరలు పెరిగాయని, అయితే ప్రతిపక్షాలు బీజేపీపై తిరుగుబాటు చేయకుండా తమపై విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు.

ప్లీనరీ సమావేశంలో ముఖ్యనేతలు మాట్లాడే సమయానికి జనం వెళ్లిపోవడంతో కుర్చీలన్నీ ఖాళీ అయ్యాయి. రామసుబ్బారెడ్డి, ఎంపీ బ్రహ్మానందరెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడే సమయానికి ఎక్కువ శాతం ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఒక్కపూట తినకపోతే ఏమవుతుంది... ఆగండి అంటూ ఎమ్మెల్యే శిల్పా విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. కార్యక్రమం చప్పగా సాగుతుండగా చప్పట్లు కొట్టమని జనాన్ని అడిగినా స్పందన రాలేదు.