ఏపీకి త్వ‌ర‌లోనే మంచి రోజులు: కె. రాఘవేంద్రరావు

రాష్ట్రంలో ‘ఎలక్షన్లు రాబోతున్నాయి.. టీడీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి’ అని ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘవేంద్రరావు పిలుపునిచ్చారు. అన్నగారి(ఎన్టీఆర్) ఆశీస్సులతో మంచి రోజులు వస్తాయని ఆయన హితవు పలికారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా గుంటూరు జిల్లా తెనాలిలోని పెమ్మసాని థియేటర్లో ‘వేటగాడు’ సినిమాను వీక్షించారు.

ఎన్నికలు రాబోతున్నాయి.. కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆయ‌న‌ సూచించారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా గుంటూరు జిల్లా తెనాలిలోని పెమ్మసాని థియేటర్లో ప్రదర్శించిన వేటగాడు సినిమాను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్తో వీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మహాయజ్ఞం లాంటి ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు పూనుకున్న ఆలపాటి, తదితరులు ధన్యులుగా భావిస్తున్నామన్నారు.

తాను ఎన్నో సినిమాలు తీసినప్పటికీ ‘అడవి రాముడు’ సినిమాతోనే మంచి గుర్తింపు లభించిందన్నారు. తమను సినిమాల్లోకి తీసుకొచ్చి తమ భవిష్యత్తును బంగారు బాటగా మలిచిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. నేను కొత్త ఇల్లు కట్టుకున్న తరువాత మొదటిగా ఆయనే కొబ్బరికాయ కొట్టించి ప్రారంభించారని చెప్పారు. అన్నగారితో గడిపిన ఆ క్షణాలు.. నేటికీ తమ గుండెల్లో మెదులుతూనే ఉన్నాయన్నారు. ఏ నటులకు సంవత్సరంపాటు సినిమాలు ప్రదర్శించడం కుదరదని, ఈ శతజయంతి ఉత్సవాల సందర్భంగా తెనాలిలో ఏడాదిపాటు అన్నగారి సినిమాలు ప్రదర్శించిన ఘనత చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు.

అన్నగారు చెప్పినట్లుగా ‘ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం’ అన్న నినాదాన్ని ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త పాటిస్తూ.. పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించిస్తున్నట్లు రాఘ‌వేంద్ర‌రావు చెప్పారు. తెలుగుదేశం పార్టీ తరఫున మంచి కార్యక్రమాలు చేస్తూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి.. అన్నగారి ఆశీస్సులతో మంచి రోజులు వస్తాయని ఆయన హితవు పలికారు. సామాజిక సేవతోపాటు తెనాలితో తనకు సత్సంబంధాలు ఉన్నాయని.. సాయిమాధవ్, ఆలపాటి రాజా మంచి సన్నిహితులని రాఘవేంద్రరావు పేర్కొన్నారు.