అయ్య‌న్న పై పొలిటిక‌ల్ రివేంజ్‌: జేసీబీలతో కూల్చేసారు

ఏపీలో రాజ‌కీయ ప్ర‌తీకార చ‌ర్య‌లు తార‌స్థాయికి చేరాయ‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే టీడీపీకి చెందిన ప‌లువురిపై కేసులు న‌మోదు చేసిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం.. తాజాగా మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంటిని.. ఆదివారం తెల్లవారుజామున పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. విశాఖ జిల్లా నర్సీపట్నంలోని ఆయన ఇంటి గోడను జేసీబీలతో కూల్చేందుకు యత్నించారు. పంట కాల్వను ఆక్రమించి గోడ నిర్మించారని పురపాలక సిబ్బంది తెలిపారు.

ప్రభుత్వ భూమిలోని రెండు సెంట్లు ఆక్రమించారని నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల రెండో తారీఖుతో ఉన్న నోటీసును ఇప్పుడు ఇచ్చి వెంటనే గోడ తొలగించడంపై అయ్యన్న కుటుంబసభ్యులు అభ్యంతరం తెలిపారు. అయ్యన్న కుటుంబ సభ్యులు కాసేపు అడ్డుకోవడంతో ఆగిన గోడ కూల్చివేత పనులను.. మున్సిపల్ సిబ్బంది మళ్లీ ప్రారంభించారు. అయ్యన్న పాత్రుడు ఇంటికి దారి తీసే రెండు మార్గాలను పోలీసులు ఇప్పటికే మూసివేశారు.

నర్సీపట్నం ఏఎస్పీ పర్యవేక్షణలోనే పోలీసు బలగాలు మోహరింపు చేయగా.. మీడియాను కూడా పరిసరాల్లోకి రానీయకుండా చర్యలు చేపట్టారు. అయ్యన్నపాత్రుడి ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయడంతోపాటు భారీగా పోలీసులను మోహరించారు. ఇటీవల అనకాపల్లి జిల్లా చోడవరం మినీ మహానాడు సభలో..అయ్యన్న చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకొని ఆయన్ను అరెస్టు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ప‌రిణామాల‌పై టీడీపీ నేత‌లు మండి ప‌డుతున్నారు.