60 రోజుల్లో 20 సార్లు తిరుమ‌ల‌కు.. జ‌గ‌న్ మంత్రి పై ట్రోల్స్‌

ఆయ‌న రెండో సారికూడా జ‌గ‌న్ మంత్రి వ‌ర్గంలో చోటు సంపాయించుకున్నారు. ఆయ‌నే బీసీ సామాజిక వ‌ర్గం శెట్టి బ‌లిజ క‌మ్యూనిటికీ చెందిన చెల్లుబోయిన‌ శ్రీనివాస‌వేణు గోపాల‌కృష్ణ‌. 2020లో అనూహ్యంగా ఇద్ద‌రు మంత్రుల‌ను రాజీనామా చేయించి రాజ్య‌స‌భ‌కు పంపించిన జ‌గ‌న్‌.. వారి స్థానంలో ఒక సీటును చెల్లుబోయిన‌కు క‌ట్ట‌బెట్టారు. త‌ర్వాత ఈ ఏడాది జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లోనూ ఆయ‌న‌కు చోటు క‌ల్పించారు. కీల‌క‌మైన స‌మాచార‌, ప్ర‌సార శాఖ‌ల మంత్రిని చేశారు.

అయితే.. ఆయ‌న‌కు ఈ ప‌ద‌వి ఇష్టంలేదో.. లేక ఈ శాఖ‌లో ప‌నిలేద‌ని అనుకున్నారో తెలియ‌దు కానీ.. ఆయ‌న వారానికి రెండు సార్లు చొప్పున ఆల‌యాల చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్నారు. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఏప్రిల్ 11న జ‌ర‌గ్గా.. ఇప్ప‌టికి కేవ‌లం 60 రోజులు దాటింది. ఈ60 రోజుల వ్య‌వ‌ధిలో ఆయ‌న 20 సార్లు తిరుమ‌ల‌ శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. ద‌ర్శించుకోవ‌డం త‌ప్పుకాక‌పోయినా.. ఈ రేంజ్‌లో తిరుమ‌ల ప్ర‌యాణాలు పెట్టుకోవ‌డం.. శ్రీవారిని ద‌ర్శించుకోవ‌డంపై నెటిజ‌న్లు ఆస‌క్తిగా స్పందిస్తున్నారు.

సీఎం జ‌గ‌న్ సార్‌.. ఆ మంత్రికి వేరే ప‌నేదైనా అప్ప‌గించండి! అనే కామెంట్లు చేస్తున్నారు. నిజానికి గ‌తంలో మంత్రి శ్రీవారి ద‌ర్శ‌నానికి వెళ్లిన‌ప్పుడు.. ఆల‌య అధికారులు ద‌గ్గ‌రుండి.. ద‌ర్శ‌నం చేయించారు. ఇలా ఒక‌టి రెండు సార్లు చేశాక‌.. వారికి కూడా విసుగు వ‌చ్చిందో ఏమో.. వెంట‌నే.. వారు కూడా ఆయ‌న వెంట రావ‌డం మానేసి.. ఫోర్త్ క్లాస్ టీటీడీ ఎంప్లాయిని పుర‌మాయించి.. చేతులు దులుపుకొన్నారు. ఎందుకంటే.. మంత్రి బిజీ కాక‌పోయినా.. టీటీడీ ఉద్యోగులు బిజీగా ఉన్నార‌ని.. అందుకే ఇలా చేసి ఉంటార‌ని అంటున్నారు.

వాస్త‌వానికి ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌భుత్వంమంత్రుల‌కు.. గ‌డ‌ప గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మాన్ని అప్ప‌గించింది. కానీ.. మంత్రి చెల్లుబోయిన ఈ కార్య‌క్ర‌మాన్ని ఒక‌సారి నిర్వ‌హించి.. ప‌క్క‌కు త‌ప్పుకొన్నారు. అప్ప‌టి నుంచి ప్ర‌జ‌లను క‌ల‌వ‌లేదు. ప్ర‌జ‌ల మ‌ధ్య కు వెళ్లిన తొలిసారి ఎదురు గాలి వీచింది. దీంతో ఆ కార్య‌క్ర‌మాన్ని ద్వితీయ శ్రేణి నాయ‌కుల‌కు అప్ప‌గించి.. ఇదిగో ఇలా.. ఆల‌యాల చుట్టూ తిరుగుతున్నారు. దీనిని గ‌మ‌నించే నెటిజ‌న్లు.. ఆయ‌న‌పై ఆస‌క్తిక‌ర ట్రోల్స్ చేస్తుండడం గ‌మ‌నార్హం.ఏదైనా సంద‌ర్భం ఉంటే.. ఆల‌యానికి వ‌చ్చినా బాగుంటుంద‌ని.. ఇలా వారానికి రెండు సార్లు వ‌స్తుంటే.. తాము మాత్రం ఏర్పాట్లు ఏం చేయ‌గ‌ల‌మ‌ని.. టీటీడీ ఉద్యోగులు సైతం పెద‌వి విరుస్తున్నారు.