ఉండ‌వ‌ల్లి.. తీసేసిన త‌హ‌సీల్దార్‌.. బీజేపీ ఫైర్‌

తాజాగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో భేటీ అయిన మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌.. త‌ర్వాత మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీపై కామెంట్లు చేసిన విష‌యం తెలిసిందే. మోడీ నియంతృత్వంతో వ్య‌వహరిస్తున్నార‌ని.. రాష్ట్రాల పాల‌కుల‌ను ఆయ‌న చెప్పు చేతల్లో పెట్టుకున్నార‌ని.. బీజేపీ సిద్ధాంతాల‌తో దేశం నాశ‌నం అవుతుంద‌ని.. భ‌విష్య‌త్తులో బీజేపీ ఈ దేశానికి ప్ర‌మాద‌క‌ర‌మ‌ని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా న‌రేంద్ర మోడీ ఉన్న‌ప్పుడు.. ముస్లింల‌ను ఊచ‌కోత కోశార‌ని.. తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

అయితే.. ఉండ‌వ‌ల్లి వ్యాఖ్య‌ల‌పై ఏపీ బీజేపీ నాయ‌కులు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఉండ‌వ‌ల్లిని ఊస‌ర‌వెల్లితో పోలుస్తూ.. కామెంట్లు చేశారు. రాష్ట్ర బీజేపీ నాయ‌కుడు.. ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెబుతూనే ఉండ‌వ‌ల్లి రాజకీయాల గురించి మాట్లాడుతున్నార‌ని.. విమ‌ర్శించారు. ఇత‌ర నేతలను కలుస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. అదేంట‌ని ప్రశ్నిస్తే అబ్బెబ్బే అదేం లేదండి ఉత్తినే పిలిస్తే వెళ్ళానంటారని చెప్పారు.

ఉండ‌వ‌ల్లి .. ఇలాంటి ఊసరవెల్లి రాజకీయాలు మానేయాల‌ని విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి సూచించారు. రాజ‌కీయ మేధావి అయితే.. ఉండ‌వ‌ల్లి.. త‌న‌కు రాజ‌కీయ భిక్ష పెట్టిన‌.. కాంగ్రెస్‌ను అటు కేంద్రంలోనూ.. ఇటు రాష్ట్రంలోనూ పైకి లేపే విధంగా కృషి చేయాల‌ని సూచించారు. అంతేకాదు.. ఆ స‌ల‌హాలు సూచ‌న‌లు ఏవో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చుకోవాల‌ని చెప్పారు. “మీదృష్టిని బీజేపీ మీద నుండి… మీకు రాజకీయభిక్ష పెట్టిన కాంగ్రెస్ ను పైకి లేపడం మీద పెట్టండి” అని విష్ణు వ‌ర్ధ‌న్ రెడ్డి సూచించారు.

ఇక‌, కేంద్రంలో మోడీ వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఘ‌న విజ‌యంద‌క్కించుకుంటున్నార‌ని విష్ణు జోస్యం చెప్పారు. “ప్ర‌ధాన మంత్రి కుర్చీ ఖాళీగా లేదు. ఇక‌పైనా ఉండ‌దు. దీనిపై ఎవ‌రైనా ఆశ‌లు పెట్టుకున్నా లాభం లేదు. ప్ర‌జ‌లు స్ప‌ష్టంగా చెబుతున్నారు. ఇక‌, ఏపీలోనూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌యం ద‌క్కించుకోవడం ఖాయం. కేంద్రంలో అయితే.. హ్యాట్రిక్ కొట్ట‌డం ఖాయం” అని విష్ణు వ‌ర్ధ‌న్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉండ‌వ‌ల్లి.. తీసేసిన త‌హ‌సీల్దార్ మాదిరిగా స‌ల‌హాలు ఇవ్వ‌డం మానుకోవాల‌ని సూచించారు.