ర‌ఘురామ‌పై అన‌ర్హ‌త‌.. స్పీక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

వైసీపీ నాయ‌కుడు, ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఉర‌ఫ్ ఆర్ ఆర్ ఆర్‌పై అనర్హత పిటిషన్‌పై లోక్‌సభ స్పీకర్ కార్యాలయం స్పందించింది. సీఎం జగన్‌పై పార్టీ ఎంపీ ఆరోపణలు అనర్హత వేటు కిందకు రాదని, పార్టీ విప్‌ను ఉల్లంఘిస్తేనే అనర్హత వేటు కిందకి వస్తుందని స్పీకర్‌ ఆఫీస్‌ వెల్లడించింది. అంటే.. సీఎం, మంత్రులను విమర్శిస్తే అనర్హత వేటు కిందకి రాదని, రఘురామ అనర్హత పిటిషన్ ప్రివిలైజ్ కమిటీ ముందు ఉందని, విచారణ ఎప్పుడు పూర్తవుతుందో కమిటీ చెబుతుందని స్పీకర్‌ కార్యాలయం తెలిపింది.

అలాగే ప‌దో షెడ్యూల్‌లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, దానిపైన కమిటీ ఏర్పాటు చేశామని, కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందిస్తోందని స్పీకర్ కార్యాలయం పేర్కొంది. రఘురామరాజుపై అనర్హత వేటు వేయాలంటూ ఆ పార్టీ లోక్‌సభ చీఫ్‌ విప్‌ మార్గాని భరత్‌ ఇచ్చిన పిటిషన్‌ను లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రివిలేజ్‌ కమిటీకి పంపించారు. ప్రాథమిక దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని స్పీకర్‌ కోరినట్టు లోక్‌సభ బులెటిన్‌ వెల్లడించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో రఘురామపై అనర్హత వేటు వేయాలని వైసీపీ గత కొంత కాలంగా స్పీకర్‌కు వినతిపత్రాలు ఇస్తున్న సంగతి తెలిసిందే.

ఇటీవల రఘురామ అనర్హత పిటిషన్పై లోక్సభ ప్రివిలేజ్ కమిటీ విచారణ నిర్వహించింది. కమిటీ ముందు ఎంపీ మార్గాని భరత్ హాజరయ్యారు. ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ సునీల్కుమార్ సింగ్ దీనిపై విచారణ చేపట్టారు. రఘురామ పార్టీ వ్యతిరేక కార్యాకలాపా లకు పాల్పడుతున్నారని.. గతంలో స్పీకర్‌కు మార్గాని భరత్ ఫిర్యాదు చేశారు. భరత్ పిటిషన్‌పై విచారణ జరిపి ప్రివిలేజ్ కమిటీకి స్పీకర్ ఓంబిర్లా నివేదిక పంపిన విషయం తెలిసిందే.

ఈ నివేదిక‌లో రాజ‌కీయ ఆరోప‌ణ‌ల‌ను కార‌ణంగా చూపి అన‌ర్హ‌త వేటు వేయ‌లేమ‌ని స్పీక‌ర్ స్ప‌ష్టం చేశారు. కేవ‌లం ఇది రాజ‌కీయ కోణంలోనే చూడాల్సి ఉంటుంద‌ని.. దీనిని పార్ల‌మెంటు నిబంధ‌న‌ల‌కు ముడి పెట్ట‌డం సాధ్యం కాద‌ని తేల్చి చెప్పిన‌ట్టు తెలిసింది. దీంతో ఆర్ ఆర్ ఆర్‌పై క‌క్ష సాధించాల‌ని భావించిన వైసీపీకి పెద్ద దెబ్బే త‌గిలిన‌ట్టు అవుతుంద‌ని అంటున్నారు ప‌రిశృల‌కులు.