నూపుర్ మంటలు : నిరసనలు, అల్లర్లు, అరెస్టులు, కర్ఫ్యూలు..

దేశ‌వ్యాప్తంగా ఇప్పుడు నుపుర్ శ‌ర్మ వ్యాఖ్య‌ల‌పైనే దుమారం రేగుతోంది. మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్య‌ల కార‌ణంగా చాలా ప్రాంతాల్లో ఉద్రిక్త‌త‌లున్నాయి. ఈ ఉద్రిక్త‌త‌ల స్థాయి రెట్టింపు కాక‌మునుపే ప్ర‌భుత్వాలు మేలుకొలుపు చ‌ర్య‌లు చేప‌ట్టాల్సి ఉంది అని ప‌రిశీల‌కులు అంటున్నారు. కానీ బీజేపీ కానీ ఇత‌ర ప్రాతినిధ్య స్వ‌రాలు కానీ ఆ దిశ‌గా అడుగులు వేయ‌కుండా వీటినొక ఓటు బ్యాంకు వ్య‌వ‌హారంగానే చూస్తున్నాయి అని కూడా అంటున్నారు. వ్య‌వ‌హారం లేదా ప‌రిణామం శ్రుతిమించ‌క మునుపే దేశ వ్యాప్తంగా ఏదో ఒక స‌ర్దుబాటు చ‌ర్య అమ‌లు కావాల్సి ఉంది అని హిత‌వు చెబుతున్నారు.

ఇప్ప‌టికే వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన నుపుర్ శ‌ర్మ‌ను, న‌వీన్ జిందాల్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా కూడా అదొక కంటి తుడుపు చ‌ర్య‌గానే ఉంది అని కొంద‌రు మండిప‌డుతున్నారు. అలా కాకుండా దీర్ఘ కాలిక చ‌ర్య‌లు ఏమ‌యినా చేప‌డితే బాగుంటుంది అని, ప్ర‌జాగ్ర‌హ జ్వాల చ‌ల్లారుతుంద‌ని కూడా మ‌రోసారి వినిపించుకునే ధోర‌ణిలో చెప్పే ప్ర‌య‌త్నం ఒక‌టి చేస్తున్నారు.

దేశంలో అస‌మ‌గ్ర‌త, అస‌మ‌ర్థ‌త అన్న‌వి పెచ్చురిల్లేందుకు తావిచ్చే ఈ అభ‌ద్ర‌త వాతావరణాన్ని నియంత్రించాల్సి ఉంది అని పలువురి సూచన. తాజా వివాదం వల్ల యూపీలో అల్ల‌ర్లు చెల‌రేగాయి. నిన్న‌టి అల్ల‌ర్ల కార‌ణంగా 130 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు ఓవైసీ లాంటి వారు దీన్నొక రాజకీయ అవకాశంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారని దీనిని ప్రధాని మోడీ గుర్తించాలని అంటున్నారు.

ఒక్క ఢిల్లీలోనే కాకుండా ప‌శ్చిమ బెంగాల్ లోనూ ఇంకా ఇత‌రేత‌ర ప్రాంతాల్లోనూ అల్ల‌ర్లు, నిరసనలు జ‌రుగుతున్నందున వ్యాఖ్య‌లు చేసిన వారు మీడియా ముందుకు వ‌చ్చి క్ష‌మాప‌ణ‌లు చెబితే ఉద్రిక్త‌తలు అదుపులోకి వస్తాయని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. ప్ర‌జ్ఞా సాధ్వీ లాంటి వారు ఈ గొడ‌వ‌ల‌ను రెచ్చ‌గొట్టేందుకు ప్ర‌య‌త్నించ‌డం కూడా సబ‌బుగా లేద‌ని ఓ వాద‌న వినిపిస్తోంది. కొన్ని చోట్ల నిన్న‌టి వేళ హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి. జార్ఖండ్ రాజ‌ధాని న‌గ‌రి రాంచీలో గాల్లోకి కాల్పులు జ‌రిపేక న‌గ‌రంలో క‌ర్ఫ్యూ విధించారు. ఇదేవిధంగా ప‌శ్చిమ బెంగాల్ లో హావ్ డాలో నిర‌స‌న‌కారులు వాహ‌నాల‌కు నిప్పెట్టారు.

అదేవిధంగా జ‌మ్మూలో క‌ర్ఫ్యూ విధించారు. క‌ల్లోలిత క‌శ్మీరంలో బంద్ పాటించారు. వీటిని అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని పాలిత వ‌ర్గాలు దీన్నొక యుద్ధ భేరిగా మార్చ‌కుండా సంయ‌మ‌న చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా సామాజిక కార్య‌కర్త‌లు కోరుతున్నారు. దేశానికి కావల్సింది శాంతి అభివృద్ధి మాత్రమే అన్న విషయాన్ని మోడీ గుర్తించాలని కోరుతున్నారు.