ఆ క్లాజ్ పై ఫైర్ .. కోర్టుకెళ్లకూడ‌దంటే ఎట్టా ?

సుదీర్ఘ కాలంగా కాంట్రాక్ట‌ర్ల‌కు బిల్లు బ‌కాయిలు ఉన్నాయి. ఏపీలో జ‌గ‌న్ స‌ర్కారు వీటిని కొన్నింటిని ఉద్దేశ పూర్వ‌కంగానే చెల్లించ‌డం లేదు. ఏమ‌ని అడిగితే కొన్ని కార‌ణాలు చెప్పి త‌ప్పుకుంటున్నారు. కొన్నింటికి స‌మాధాన‌మే లేకుండా పోతోంది. రాజ‌ధాని ప‌నుల‌కు సంబంధించి కూడా బిల్లులు చెల్లింపులో ముఖం చాటేసిన వైనం ఇప్ప‌టికీ గుర్తుండే ఉంటుంది. దీంతో అమ‌రావ‌తి ప‌నులు చేప‌ట్టిన కొంత‌మంది కాంట్రాక్ట‌ర్లు బిల్లుల చెల్లింపు చేయ‌క‌పోతే ఆత్మ‌హ‌త్యే శ‌ర‌ణ్యం అని కూడా చెప్పారు. అంతేకాదు న‌రేగా ప‌నుల‌కు కూడా బిల్లుల చెల్లింపులేక పోవ‌డంతో స్థానిక ప్ర‌జా ప్ర‌తినిధులు గ‌గ్గోలు పెడుతున్నారు.

వాస్త‌వానికి ఉపాధి ప‌థ‌కం ప‌నుల‌కు కేటాయింపు చేసిన డ‌బ్బులు మ‌రోదానికి మ‌ళ్లింపు చేయ‌కూడ‌దు అన్న నిబంధ‌న ఉన్నా కూడా జ‌గ‌న్ స‌ర్కారు అవేవీ ప‌ట్టించుకోవ‌డం లేదు అన్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. త‌క్షణ‌మే బిల్లుల చెల్లింపు ప్ర‌క్రియ చేయాల‌ని సుప్రీం ఆదేశించినా కూడా ఫ‌లితం లేక‌పోయింది. ఈ ద‌శ‌లో ప్ర‌భుత్వం తాజాగా మెలిక పెట్టింది. కాంట్రాక్ట‌ర్లు తాము ప్ర‌భుత్వంతో ఒప్పందం చేసుకునే స‌మ‌యంలోనే బిల్లుల చెల్లింపు తాత్స‌రం అయినా కోర్టుకు వెళ్ల‌బోమ‌ని ఓ డిక్ల‌రేష‌న్ ఇవ్వాల‌ని అంటోంది స‌ర్కారు. ఇదే ఇప్పుడు పెను వివాదానికి తావిస్తోంది.

అస‌ల‌కే వైసీపీ స‌ర్కారులో రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల మేర‌కు ప‌నులు చేప‌ట్టేందుకు కూడా కాంట్రాక్ట‌ర్లు ఎప్ప‌టి నుంచో ఆస‌క్తి చూప‌డం లేదు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేల ఒత్తిడి మీద ప‌నులు చేస్తున్నా చాలా సంద‌ర్భాల్లో వారికి బిల్లులు స‌కాలంలో రావడం లేదు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు లాబీయింగ్ చేసి నిధులు తెచ్చుకున్న దాఖలాలు ఉన్నా అవి కూడా కొద్దిపాటి ప‌నుల‌కే ప‌రిమితం అయి ఉంటున్నాయే త‌ప్ప పెద్ద పెద్ద ప‌నుల పూర్తికి ఏపాటి కూడా చాల‌డం లేదు.

లోక‌ల్ ఏరియా డెవ‌ల‌ప్మెంట్ ఫండ్స్ పేరిట ఇస్తామ‌న్న రెండు కోట్ల రూపాయ‌లు (ఒక్కో ఎమ్మెల్యేకూ చెల్లిస్తాం అని అప్ప‌ట్లో అన‌గా గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం ప్రారంభానికి ముందు) చెప్పినా కూడా వాటి ఊసేమీ లేకుండా పోయింది. అస‌లు ఎంపీల‌కు కేంద్రం ఇచ్చిన త‌ర‌హాలో ఎమ్మెల్యేల‌కూ ఇవ్వాల‌నుకున్నా అవి ఇచ్చారో ఇవ్వ‌లేదో అన్న‌వాటిపై స్ప‌ష్టత లేదు. ఇక లోక‌ల్ ఫండ్స్ (కేంద్రం త‌ర‌ఫున పంచాయతీల‌కు అందే నిధులు) అవి కూడా జ‌గ‌న్ ఖ‌ర్చు పెట్టేశారు. దీంతో ఆ నిధులు మేలోగా చెల్లించేద్దాం అని అనుకున్నా వాటిపై కూడా స్ప‌ష్ట‌త ఏమీ సంబంధిత వ‌ర్గాల నుంచి రావ‌డం లేదు. ఈ ద‌శ‌లో చంద్ర‌బాబు ఏమంటున్నారో చూద్దాం…

“జగన్ సర్కార్ 3 ఏళ్ల వైఫల్యాల రివర్స్ పాలన రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకుపోయింది. కాంట్రాక్టర్లను బిల్లుల కోసం కోర్టుకు వెళ్లొద్దు అని టెండర్ డాక్యుమెంట్లోనే నిబంధన పెట్టడం రాష్ట్ర దుస్థితికి, అసమర్థ పాలనకు నిదర్శనం. కృష్ణా డెల్టా కాలువల మరమ్మతు టెండర్లో బిల్లుల కోసం ఒత్తిడి తేవొద్దు అని ప్రభుత్వం పేర్కొన్న నిబంధనలు రాష్ట్ర ప్ర‌భుత్వం పరువు తీశాయి. పాలకులకు ఇది సిగ్గుగా అనిపించిందో లేదో కానీ…ప్రభుత్వానికి మాత్రం ఇది సిగ్గుచేటు.

రూ.13 కోట్ల టెండర్ పనిలో బిల్లుల కోసం కోర్టుకు వెళ్లొద్దు అనే నిబంధన పెట్టడం దేశంలో మరే రాష్ట్రంలోను ఉండి ఉండదు. అసలు న్యాయం కోసం కోర్టుకు వెళ్లొద్దు అనే నిబంధన పెట్టే హక్కు మీకెక్కడిది? బిల్లుల కోసం కోర్టుకు వెళ్లకూడదు అనే షరుతులు పెట్టే దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకు వెళ్లిన ఈ ముఖ్యమంత్రిని ఏమనాలి? రాష్ట్రంలో లక్షన్నర కోట్ల బిల్లులు పెండింగ్ పెడితే… కాంట్రాక్టర్లపై, ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందిపై ఎంత ప్రభావం చూపుతుందో ఈ మూర్ఖపు ప్రభుత్వానికి అర్థం కాదు.

ప్రభుత్వం బిల్లులు ఇవ్వని కారణంగా నిర్మాణ, వ్యాపార, సేవల రంగంలో లక్షల మంది ఉపాధి కోల్పోవడానికి జగన్ కారణం అయ్యారు. ప్రభుత్వం కారణంగా ఆయా సంస్థలు దివాళా తీయడం సమాజంపై ఎంతటి ప్రతి కూల ప్రభావాన్ని చూపుతుందో తెలుసుకోవాలి. రూ.13 కోట్ల పనులకు ధైర్యంగా టెండర్లు పిలవలేని ఈ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తుందా ? ఎయిర్ పోర్ట్లు, స్టీల్ ప్లాంట్లు నిర్మిస్తుందా ? మూడు రాజధానుల కడుతుందా? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి వైఫల్యం కారణంగా ఏపీ స్టేట్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే పరిస్థితి తీవ్ర ఆవేదన కలిగిస్తోంది.ఎవరి బతుకు వారు బతికే పరిస్థితి కూడా లేకుండా చెయ్యడం సంక్షేమమా… ? కోట్ల మంది జీవితాలను చిన్నాభిన్నం చెయ్యడం అభివృద్ది అవుతుందా? అభివృద్ది వైపు ప్రయాణించే రాష్ట్రాన్ని అంధకారం వైపు నెట్టేసిన జగన్ రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేశారు…” అని మండిప‌డ్డారాయ‌న.