కేసీఆర్ బ్యాడ్ టైం కాక‌పోతే బీజేపీకి ఇన్ని చాన్స్‌లు ఏంటో!

తెలంగాణ‌లో ఎట్టి ప‌రిస్థితుల్లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష స్థాయికి చేరుకోవాల‌ని, ఏ మాత్రం అవ‌కాశం దొరికినా అధికారం చేజిక్కించుకోవాల‌ని బీజేపీ ప్ర‌య‌త్నిస్తున్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌మ‌కు క‌లిసి వ‌చ్చే ప్ర‌తి సంద‌ర్భాన్ని ఉప‌యోగించుకొని తెలంగాణ‌ ప్ర‌భుత్వంపై కాషాయ పార్టీ విరుచుకుప‌డుతోంది. తాజాగా జ‌రిగిన ఓ బాధ‌క‌ర‌మైన సంఘ‌ట‌న‌, త‌ద‌నంత‌ర ప‌రిణామాలు, దీనిపై బీజేపీ స్పంద‌న మ‌రోమారు ఇదే అంశాన్ని గుర్తు చేసే విధంగా ఉంద‌ని అంటున్నారు. జూబ్లిహిల్స్ లో మైనర్ బాలికపై అఘాయిత్యం జ‌రిగిన ఉదంతంతో టీఆర్ఎస్ ఫ్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్ అయ్యారు.

టీఆర్ఎస్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున ఆడబిడ్డకు న్యాయం చేయలేకపోతే, మారుమూల పల్లెల్లో ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. “చంచల్ గూడ‌ జైళ్లో ఉంచాల్సిన నిందితులను సేఫ్ గా దాచిపెడతారా? కేసు నుండి వారిని తప్పించేందుకు కష్టపడుతున్న పోలీసులు చట్టాన్ని రక్షించేవాళ్లా… భక్షించేవాళ్లా? మీరు మనుషులా… రాక్షసులా… మైనర్ బాలికపై అఘాయిత్యం చేస్తే నిందితులను అరెస్ట్ చేయరా?… ఎఫ్ఐఆర్ లో నిందితుల పేర్లు నమోదు చేయరా? సీసీ టీవీ కెమెరాలున్నదెందుకు? బాలికను తీసుకెళుతున్న కారులో టీఆర్ఎస్, ఎంఐఎం నాయకులున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ పుటేజీల ఆధారంగా నిందితులను ఇప్పటి వరకు ఎందుకు విచారించలేదు? రాష్ట్రంలో టీఆర్ఎస్, ఎంఐంఎం నాయకులు ఏదైనా చేయొచ్చు… కాపాడటానికి పోలీసులు రడీగా ఉన్నారనే సంకేతాలను పంపుతున్నారా?”అని ధ్వజమెత్తారు.

జూబ్లిహిల్స్ మైనర్ బాలికపై అఘాయిత్వం జరిగి 5 రోజులైనా నిందితులను ఇంతవరకు అరెస్టు చేయకపోవడం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. “రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాల వెనుక టీఆర్ఎస్, ఎంఐఎం నేతల హస్తమున్నట్లు అనేక వార్తలొస్తున్నా…… సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నట్లు? ఆ పార్టీ నేతల ప్రమేయమున్నట్లు తేలినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఫాంహౌజ్ లో పడుకుని ఫిడేల్ వాయిస్తున్నారా? ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కనీసం స్పందించాలనే ఆలోచన కూడా లేని సీఎం దేశంలో కేసీఆర్ మాత్రమే” అని మండిపడ్డారు. కాగా, విస్మ‌య‌క‌ర‌మైన ఈ సంఘ‌ట‌న‌లో ఐదు రోజులైనా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం అనే సంద‌ర్భం ఓ వైపు బాధాక‌రం కాగా, మ‌రోవైపు బీజేపీ అవ‌కాశం ఇచ్చేలా ప‌రిణామాలు మారుతున్నాయ‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.