దావోస్ నుంచి రిట‌ర్న్‌.. పెట్టుబ‌డుల‌పై జ‌గ‌న్ ఏం చెబుతారో?

స్విట్జ‌ర్లాండ్‌లోని దావోస్‌లో జ‌రిగిన ప్ర‌పంచ ఆర్థిక ఫోరం స‌ద‌స్సుకు హాజ‌రైన ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. అక్కడ బిజీబిజీగా గ‌డిపారు. తాజాగా ఆయ‌న ఏపీకి చేరుకున్నారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో జ‌గ‌న్ సాధిం చిందేంటి?  ఇప్పుడు ఏపీ ప్ర‌జ‌ల‌కు ఏం చెబుతారు? అనేది ప్ర‌శ్న‌గా మారింది.

దావోస్‌లో ఏం చేశారు?

వాస్త‌వానికి దావోస్‌కు వెళ్లిన‌ప్పుడు.. అక్క‌డ‌కు వ‌చ్చే విదేశీ కంపెనీల‌ను క‌లుసుకుని.. భారీ ఎత్తున పెట్టుబ‌డులను ఆక‌ర్షించాల్సి ఉంటుంది. కానీ, జ‌గ‌న్ బృందం మాత్రం.. రాష్ట్రంలోనే ఉండే కంపెనీల ప్రతినిధులను కలుసుకుని ఒప్పందం చేసుకుంది. అరబిందో,  దానీ,  గ్రీన్‌కో ల‌తో  చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకుంది. వాస్తవానికి వీరితో ఒప్పందాలు చేసుకోవాలంటే..వారినే ఏపీకి పిలిస్తే.. స‌రిపోతుంది. లేదా.. సీఎం అయినా.. ఢిల్లీ వెళ్తే.. వారు వ‌స్తారు. కానీ, దావోస్ వెళ్లి మ‌రీ.. వారితో ఒప్ప‌దాలు చేసుకున్నారు.

ఇక‌,  కుదిరిన ఒప్పందాలన్నీ ‘గ్రీన్‌ ఎనర్జీ’ రంగంలోనే కావ‌డం మ‌రో విశేషం. విపక్షంలో ఉండగా సౌర, పవన విద్యుత్తు ఒప్పందాలపై జగన్‌ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి అయ్యాక అసెంబ్లీలో కూడా విరుచుకుపడ్డారు. గ్రీన్‌కోతోపాటు మూడు కంపెనీల పేర్లు ప్రస్తావించి ఆరోపణలు చేశారు. గ్రీన్‌కో సంస్థ చంద్రబాబు హయాంలోనే కర్నూలు జిల్లాలో భారీ ‘గ్రీన్‌ ఎనర్జీ’ ప్రాజెక్టును చేపట్టింది. జగన్‌ అధికారంలోకి వచ్చిన ఆరేడు నెలలు ఈ ప్రాజెక్టు పనులు డోలాయమానంలో పడ్డాయి.

ఇప్పుడు దావోస్‌లో అదే సంస్థతో వేల కోట్ల రూపాయల పెట్టుబడితో గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి అంటూ ఒప్పందం చేసుకున్నారు. మరోవైపు అరబిందో కూడా ఇక్కడి కంపెనీనే! ఆ కంపెనీతోనూ దావోస్‌లో గ్రీన్‌ ఎనర్జీపైనే ఒప్పందం కుదుర్చుకున్నారు. గ్రీన్‌ ఎనర్జీపైనే ఒప్పందం చేసుకున్న మరో కంపెనీ అదానీ. చంద్రబాబు హయాంలో అదానీ సంస్థతో కుదిరిన ఒప్పందాన్ని జగన్‌ తిరగదోడారు. ఆ తర్వాత పెట్టుబడులను, ఉద్యోగాల సంఖ్యను కుదించి… అదానీ సంస్థతోనే మరో ఒప్పందం చేసుకున్నారు.

మన దేశంలో, రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహించే సంస్థలతోనే స్విట్జర్లాండ్‌లో ఒప్పందాలు కుదర్చుకున్న జ‌గ‌న్ ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు ఏం చెబుతారు?  ఎన్ని వేల కోట్లు ఏపీకి తెచ్చామ‌ని… చెబుతారు?  ఎంత మంది నిరుద్యోగుల‌కు ఉపాధి క‌ల్పించామ‌ని వెల్ల‌డిస్తారు? అనేది చూడాల్సి ఉంది.

దుమ్మురేపిన తెలంగాణ‌

ఏపీతో పోల్చుకుంటే.. దావోస్‌లో తెలంగాణ ప్ర‌భుత్వం దుమ్ము రేపింద‌నే చెప్పాలి. తొలిరోజే రూ. 600 కోట్ల పెట్టుబడులను సాధించిన తెలంగాణకు..  సమావేశాల చివరిరోజు ఒక్క హ్యుందాయ్‌ కంపెనీ నుంచే రూ. 1,400 కోట్ల పెట్టుబడులపై ప్రకటన వచ్చింది. దిగ్గజ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్‌ సీఐవో యాంగ్చోచి తెలంగాణ ప్రతినిధుల బృందానికి నేతృత్వం వహిస్తున్న మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో సిద్ధమవుతున్న మొబిలిటీ క్లస్టర్‌లో రూ. 1,400 కోట్లతో టెస్ట్‌-ట్రాక్‌ను ఏర్పాటు చేయనున్నట్లు యాంగ్చోచి ఈ సందర్భంగా వెల్లడించారు. ఇలా.. తెలంగాణ ప్ర‌పంచ దేశాల‌ను ఆక‌ర్షిస్తే.. ఏపీ మాత్రం.. సొంత దేశంలోని కంపెనీల‌ను బ‌తిమాలుకునేందుకు దావోస్ వెళ్లిన‌ట్టు అనిపించింద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.