లోకేష్ వ్యూహం సూప‌ర్‌.. సీనియ‌ర్లు గుస్సా?

ఉన్న‌ది ఉన్న‌ట్టు చెబితే..ఎవరికైనా… ఆగ్ర‌హం, ఆవేశం త‌ప్ప‌దు!  ఇప్పుడు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌దర్శి నారా లోకేష్ కూడా ఉన్న‌ది ఉన్న‌ట్టుగానే చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు ఇచ్చే విష‌యంపై ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అంద‌రికీ టికెట్లు ఇచ్చేది లేద‌ని వారి వారి సామ‌ర్థ్యాన్ని అంచ‌నా వేసి టికెట్లు ఇస్తామ‌ని అన్నారు. అంతేకాదు.. వ‌రుస‌గా మూడు సార్లు ఓడిపోయిన నాయ‌కుల‌కు టికెట్లు ఇచ్చేది లేద‌ని చెప్పారు. దీనిపైనే ఇప్పుడు సీనియ‌ర్లు మండిప‌డుతున్నారు.

“లొకేష్‌కు ఏం తెలుసు . రాజ‌కీయం?“ అంటూ.. గుస‌గుస‌లాడుతున్నారు. గుర్రుగా కూడా ఉన్నారు. అంటే. . వీరి ఉద్దేశంలో ఒక‌సారి టికెట్ ఇస్తే.. స‌ద‌రు నాయ‌కుడు గెలిచినా.. ఓడినా.. ఆయ‌న‌కే టికెట్ ఇవ్వాల‌నే మూస ధోర‌ణిలో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. కానీ, లోకం మారుతోంది. రాజ‌కీయాలు కూడా మారుతున్నాయి. ప్ర‌జ‌లు మార్పును కోరుకుంటున్న‌ట్టుగానే.. రాజ‌కీయాల్లోనూ మార్పులు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌నేది  యువ నేత‌గా లోకేష్ అభిప్రాయం.

ఎందుకంటే.. ఎవ‌రినైనా ప్ర‌జ‌లు ఓడించారంటే.. ఒక‌టి.. ఆ నాయ‌కుడిలో అయినా లోపం ఉండాలి. లేదా.. ప్ర‌జ‌ల‌కు ఆయ‌న న‌చ్చ‌క‌పోవ‌డ‌మైనా కార‌ణం కావాలి. మ‌రి ఈ రెండు కార‌ణాలే ఎన్నిక‌ల్లో గెలుపు ఓట‌ము ల‌ను ప్ర‌భావితం చేస్తున్న‌ప్పుడు.. వారినే ఎందుకు కొన‌సాగించాలి.. మార్పు ఎందుకు రాకూడ‌దు? అనేది ప్ర‌శ్న‌. ఈ ఆలోచ‌న‌తోనే ముఖ్యంగా క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించిన లోకేష్ ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన సూచ‌న‌ల మేర‌కే.. ఈ సంచ‌ల‌న నిర్ణ‌యం దిశ‌గా పార్టీలో తీర్మానం పెట్టారు.

కానీ, ఇప్పుడు లోకేష్ ప్ర‌క‌ట‌న‌ను సీనియ‌ర్లు త‌ప్పుబ‌డుతున్నారు. త‌మ‌కు ఈ విధానం న‌చ్చ‌డం లేద‌ని చెబుతున్నారు. పోనీ.. వీరేమైనా.. వ‌రుస విజ‌యాలు సాధిస్తున్నారా? అంటే.. లేదు. ఎక్కిక‌క్క‌డ తిష్ట‌వేసి.. పార్టీని త‌మ క‌దంబ హ‌స్తాల్లో ఉంచుకుని.. వారు ఎద‌గ‌కుండా.. పార్టీని ప‌ట్టించుకోకుండా.. చేస్తున్న‌వారికి చెక్ పెడితే త‌ప్పేంటి?  పార్టీ ఉంటే.. అంద‌రూ ఉంటారు. అదే పార్టీలేక‌పోతే.. ఎవ‌రూ ఉండ‌రు. ఈ చిన్న విష‌యాన్ని నాయ‌కులు ఎందుకు గ్ర‌హించ‌లేక పోతున్నార‌నేది ప్ర‌శ్న‌. ఏదేమైనా..లోకేష్ తీసుకున్న నిర్ణ‌యం.. ఆలోచ‌న స‌రైన‌వేన‌ని మెజారిటీ నాయ‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.