హైద‌రాబాద్ వాసుల‌కు అదిరిపోయే షాకిచ్చిన కేసీఆర్‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యంతో హైద‌రాబాద్ వాసుల్లో కొత్త టెన్ష‌న్ మొద‌లైంది. క‌రోనా క‌ల‌క‌లంపై ఆదిలో తీపిక‌బురు ఇచ్చిన‌ప్ప‌టికీ ఇప్పుడు తాజాగా షాక్ ఇచ్చినట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

క‌రోనా వైర‌స్ విస్త‌రిస్తున్న స‌మ‌యంలో… కేసుల తీవ్ర‌త ఎలా ఉందో తెలుసుకోవ‌డానికి 50 వేల టెస్ట్‌లు చేయ‌నున్న‌ట్లు తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ తాజాగా ఈ టెస్టుల‌కు బ్రేక్ ప‌డింది. తెలంగాణ‌ రాష్ట్రంలో టెస్ట్‌లు పెర‌గ‌డంతో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న త‌రుణంలో హైద‌రాబాద్ ప‌రిధిలో టెస్టులు నిలిపివేశారు.

తెలంగాణ‌లో రోజుకో కొత్త రికార్డు త‌ర‌హాలో పాజిటివ్ కేసుల సంఖ్య పైపైకి పోతూనే ఉంది. ఇటీవ‌లే కరోనా పరీక్షల విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వానికి కీల‌క ఆదేశాలు రాష్ట్ర హైకోర్టు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో వార్డుల వారిగా కరోనా కేసులు వెల్లడించాల‌ని జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కేసుల వివరాలు కాలనీ సంఘాలకు ఇవ్వాల‌ని ఆదేశించింది.

ర్యాపిడ్‌ యాంటీజెంట్‌ టెస్ట్‌ నిర్వహించాలని ఐసీఎంఆర్‌ సూచించింద‌ని గుర్తుచేసిన‌ హైకోర్టు.. ఐసీఎంఆర్‌ సూచనలను పరిగణలోకి తీసుకోవాల‌ని పేర్కొంది. అనంత‌రం ప్ర‌భుత్వం ముందుకు వ‌చ్చి ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని సూచించింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ప‌రిధి ఆ ప‌క్క‌నే ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ టెస్ట్‌లు నిర్వ‌హిస్తున్నారు. అయితే ఈ ప్ర‌క్రియ‌కు తాత్కాలికంగా బ్రేక్ ప‌డింది.

ఇప్పటికే సేకరించిన శాంపిల్స్‌కు సంబంధించిన టెస్టింగ్ ప్ర‌క్రియ పూర్తికాక‌పోవ‌డంతో ఇవాళ, రేపు.. రెండు రోజుల పాటు టెస్ట్‌ల‌ను అధికారులు నిలిపివేశారు. ఇత‌ర రాష్ట్రాల‌తో పోలిస్తే తెలంగాణ క‌రోనా టెస్ట్‌ల సంఖ్య చాలా త‌క్కువ‌గా ఉంద‌నే విమ‌ర్శ‌లు బీజేపీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

కాగా, బుధ‌వారం నాటికి తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు 10 వేలు దాటాయి. బుధ‌వారం ఒక్క‌రోజే 891 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటిలో 719 జీహెచ్ఎంసీ పరిధిలోనివి కాగా హైద‌రాబాద్ ప‌రిస‌ర జిల్లాలైన‌ రంగారెడ్డిలో 86, మేడ్చల్‌లో 55 కేసులు న‌మోదు అయ్యాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 10444కి చేరగా చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4361కి చేరింది.