మ‌హాన‌డు తీర్మానాలు.. ఏపీ తెలంగాణ‌ల‌పై కీల‌క చ‌ర్చ‌!

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని ఒంగోలులో నేటి నుంచి జరగనున్న టీడీపీ మహానాడు తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం తెలిపింది. ఏపీకి 12, తెలంగాణకు 3, అండమాన్‌కు ఒక తీర్మానం చొప్పున మెుత్తం 17 తీర్మానాలకు ఆమోదం తెలిపారు. వీటిలో ప్ర‌ధానంగా.. ప్ర‌జ‌లు ప‌డుతున్న క‌ష్టాలు.. ప్ర‌భుత్వ భారాలు.. చెత్త‌పై ప‌న్ను.. రైతుల‌కు విద్యుత్ మీట‌ర్లు.. ఉద్యోగాలు లేక‌పోవ‌డం.. మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న దాడులు.. చిన్నారుల‌పై జ‌రుగుతున్న అకృత్యాలు వంటి అనేక అంశాల‌ను పొందుప‌రిచారు.

ఒంగోలులో జరిగిన టీడీపీ పొలిట్‌ బ్యూరో సమావేశం ముగిసింది. నేటి నుంచి ఒంగోలులో టీడీపీ మహానాడు జరగనున్న నేపథ్యంలో పలు అంశాలపై పొలిట్ బ్యూరోలో చర్చ జరిగింది. మహానాడు తీర్మానాలకు పొలిట్‌బ్యూరో ఆమోదం తెలిపింది. ప్రజాప్రతినిధుల సభలో మొత్తం 17 తీర్మానాలు చేశారు.

వీటిలో ఏపీకి 12, తెలంగాణకు 3, అండమాన్‌కు ఒక తీర్మానం ఉంది. రాజకీయ తీర్మానంపై పొలిట్‌ బ్యూరో లో కీలక చర్చ జరిగింది. రాష్ట్ర ప్రయోజనాల మేరకు తీర్మానం ఉండాలని నేతలు అభిప్రాయపడ్డారు. వైసీపీ బస్సు యాత్రపై పొలిట్‌ బ్యూరోలో ప్రస్తావన వచ్చింది. బస్సు యాత్ర ఓ డ్రామా అంటూ చర్చ జరిగింది.

వైసీపీ 9 మంది రాజ్యసభ సభ్యుల్లో నలుగురు రెడ్డి వర్గం వారేనని నేతలు గుర్తుచేశారు. లాబీయింగ్‌ చేసేవారికి రాజ్యసభ సీటు ఇచ్చారని ఈ సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ బస్సు యాత్రను ప్రజలు పట్టించుకోవట్లేదని పలువురు నేతలు వ్యాఖ్యానించారు. ఈ భేటీలో ఏపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికపై కళా వెంకట్రావు ప్రస్తావించారు. ఎంబీసీ నుంచి కొత్తవారికి ఏపీ అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందని సూచించారు.