మళ్ళీ యాక్టివ్ అవుతున్న గంటా

ఇంతకాలం ఎక్కడున్నారో కూడా తెలీని, ఏమి చేస్తున్నారో కూడా తెలీని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీలో మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో పార్టీ మినీ మహానాడు నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుకు సమిష్టి కృషి చేయాలని, చంద్రబాబునాయుడును మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని గంటా పిలుపునివ్వటం చర్చనీయాంశమైంది. ఒక్క ఛాన్సంటు అధికారం అందుకున్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలుచేసినట్లు మండిపడ్డారు.

రాష్ట్రానికి సమర్ధ నాయకత్వం ఇపుడు చాలా అవసరమని, ఆ నాయకత్వం చంద్రబాబు తోనే సాధ్యమని గంటా చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన వాలంటీర్ల వ్యవస్ధకు ప్రత్యామ్నాయంగా టీడీపీ క్లస్టర్ వ్యవస్ధను తీసుకొచ్చిందన్నారు. కష్టపడి పనిచేసిన వారికే పదవులు వస్తాయన్న విషయంలో రెండో ఆలోచనే లేదన్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే అసలు పార్టీ కోసం గంటా చేసిన కష్టమేంటో ఎవరికీ అర్థం కావడం లేదు. అధికారం లేకపోతే గంటా అసలు ఉండలేరన్న విషయం అందరికీ తెలిసిందే.

అందుకనే అధికారంలో ఉండే పార్టీలోనే ఉండటానికి గంటా ప్రయత్నిస్తారు. ఈ నేపధ్యంలోనే ఉత్తర నియోజకవర్గంలో గంటా గెలిచిన దగ్గర నుండి అధికారంలోకి వచ్చిన వైసీపీలో చేరేందుకు తీవ్రమైన ప్రయత్నాలే చేశారు. అయితే ఆయన ప్రయత్నాలు సక్సెస్ కాకపోవడంతో వేరే దారి లేక తన ప్రయత్నాలను విరమించుకున్నారు. పోనీ అప్పుడైనా పార్టీలో యాక్టివ్ గా ఉన్నారా అంటే అదీ లేదు. చాలాకాలం టీడీపీలో గంటా ఉన్నారా లేదా అన్న సందేహాలున్నాయి. చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా గంటా చాలాసార్లు కనబడలేదు.

పార్టీ విషయాలు మాట్లాడడానికి రమ్మని చంద్రబాబు కబురు చేసినా గంటా వెళ్ళలేదు. ఇలాంటి గంటా శ్రీనివాసరావు ఇపుడు పార్టీలో యాక్టివ్ అయ్యారంటే అర్థమేంటి ? టీడీపీలో కంటిన్యూ అవటం తప్ప వేరే దారి లేదని బహుశా గంటాకు అర్ధమయ్యుంటుంది. అందుకనే ఎలాగూ షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి యాక్టివ్ గా లేకపోతే టికెట్ కూడా కష్టమని అనుకున్నట్లున్నారు. అందుకనే ఒక్కసారిగా యాక్టివై పార్టీ గెలుపుకు కష్టపడాలని, చంద్రబాబును సీఎం చేయాలని మొదలుపెట్టారు.