ఇట్లుంట‌ది కేసీఆర్‌తోని: రేవంత్ ఫైర్‌

టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పంజాబ్ రైతులకు సీఎం కేసీఆర్ ఆర్థికసాయం అందజేయడంపై రేవంత్ మండిపడ్డారు. తెలంగాణ రైతులను కనీసం పలకరించని కేసీఆర్… పంజాబ్ రైతులకు సాయం చేయడం పట్ల మర్మమేమిటోనని అనుమానం వ్యక్తం చేశారు.

అయినవారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో అంటే ఇదేనేమోనంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశిస్తూ చురకలంటించారు. తెలంగాణలో రోజుకు ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఫాంహౌస్ గడప దాటి ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించని కేసీఆర్… పంజాబ్ రైతులకు పరిహారం ఇచ్చారని ట్విటర్‌ వేదికగా రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ మర్మమేమిటో మన రైతన్నలకు అర్థం కాదనుకుంటున్నారా… అని సీఎంను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

ఉత్తరాది పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్… ఆదివారం చండీగఢ్‌ పర్యటించారు. రైతులు, జవాన్ల కుటుంబాలను సీఎం కేసీఆర్‌, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సానుభూతి ప్రకటించారు. చండీగఢ్‌లోని ఠాగూర్‌ స్టేడియంలో రైతుల కుటుంబాలను ఇరువురు ముఖ్యమంత్రులు వెళ్లి పలకరించారు. రైతు ఉద్యమంలో అమరులైన అన్నదాతలకు నివాళులర్పించారు. అనంతరం ఠాగూర్ స్టేడియంలో రైతుల కుటుంబాలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడారు.

ప్రసంగం తర్వాత గాల్వన్‌లోయ ఘర్షణలో అమరులైన జవాన్ల కుటుంబాలకు, అమరులైన రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందజేశారు. ఢిల్లీ, పంజాబ్‌ సీఎంల సమక్షంలో 600 కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున చెక్కుల పంపిణీ చేశారు. ఈ మొత్తం రూ.18 కోట్ల‌కు పైనే ఉండ‌డం.. రాష్ట్రం ప్ర‌స్తుతం అప్పుల్లో ఉండ‌డంతో విప‌క్షాల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే బీజేపీ నేత‌లు సైతం తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్రంలో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన రైతుల‌నుఎన్న‌డైనా ప‌రామ‌ర్శించారా? అంటూ.. కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి సూటిగా ప్ర‌శ్నించారు.